సోనియాపై సాక్షి డైరెక్ట్ అటాక్
అధిష్టానానికి గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. సోనియా దేశానికి ప్రధాని కారు, అధ్యక్షురాలు కారు, ఉర్రూతలూగించే ప్రసంగాలు చేయరు కానీ భారత రాజకీయాలను శాసిస్తున్నారని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రబ్బరు స్టాంపుగా కూడా అభివర్ణించింది. పార్టీకి ముస్లింలు దూరమవుతున్నారని, అయోధ్య తీర్పుపై సోనియా మౌనం వహించారని తెలిపింది. కాంగ్రెసు ప్రాబల్యం ఇక గతమేనని వ్యాఖ్యానించింది. రాయబరేలీ కోట బీటలు వారుతోందని, స్థానిక సమస్యలను సోనియా పట్టించుకోవడం లేదని, ఇందుకు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శమని వ్యాఖ్యానించింది. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోచీ తప్పించుకోవడానికి తగిన మార్గం ఏర్పాటు చేసింది కూడా సోనియా అనే అర్థం వచ్చేలా సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానం చేసింది.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కె. రోశయ్య మీదనే యుద్ధం ప్రకటిస్తూ వచ్చిన వైయస్ జగన్ ఇక కొండను ఢీకొట్టేందుకు సిద్ధపడినట్లు తాజా వార్తాకథనాన్ని బట్టి అర్థమవుతోంది. కాంగ్రెసు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పూర్తిగా బలహీనపడుతోందని చెప్పడానికి ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, వైయస్ జగన్ కాంగ్రెసుతో రాజీ పడడం అనేది ఉండకపోవచ్చునని అనిపిస్తోంది.