వైయస్ జగన్ బలమెంత?
ఇప్పటికిప్పుడైతే జగన్ కు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ ఎనిమిది మంది శాసనసభ్యులు బయటపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో కూడిన ఎనిమిది శాసనసభ్యులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమను జగన్ వర్గంగా గుర్తించి కమిటీల్లో వేయడం లేదని ఫిర్యాదు చేశారు. వీరు ఆరు నూరైనా జగన్ వైపే ఉంటారనే ప్రచారం సాగుతోంది. కాగా, కొండా సురేఖ మొదటి నుంచి జగన్ కు అనుకూలంగానే ఉన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జగన్ వైపుంటారు. పార్టీని చీలిస్తే జగన్ వెంట వెళ్లే శాసనసభ్యుల సంఖ్యా ఎంత ఎక్కువగా వేసుకున్నా రెండు పదులు దాటదని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన సమయంలో మాత్రం ఆయనకు మద్దతిచ్చే వారి సంఖ్య వందకు పైగా ఉంది. అయితే, జగన్ పార్టీని చీల్చకపోతే, కాంగ్రెసు పార్టీ అధిష్టానం మాట ఇస్తే ఆ మద్దతు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. అందువల్లనే జగన్ పై కఠిన నిర్ణయాలు చేస్తూ ఆయనను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు.
జగన్ పార్టీని చీల్చి, వేరు కుంపటి పెడితే మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా కొద్ది కాలం సాగింది. ఓ ప్రముఖ దినపత్రిక నిత్యం మధ్యంతర ఎన్నికల గురించే మాట్లాడుతూ వచ్చింది. జగన్ అసలు బలాన్ని పసిగట్టిన తర్వాత తన వార్తాకథనాల తీరును మార్చుకున్నట్లు చెబుతున్నారు. జగన్ కు ప్రజాబలం ఉందనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అయితే అది అసలు బలం కాదని, కడపకు చెందినవారు జగన్ ఓదార్పు యాత్రకు వాహనాల్లో ప్రజలను తరలిస్తున్నారని గిట్టనివారంటున్నారు. ఏమైనా, జగన్ వేడి రాష్ట్ర రాజకీయాలపై గానీ కాంగ్రెసు పార్టీపై గానీ తక్కువగానే ఉంటుందని అంటున్నారు.