ఆ ముగ్గురు నేతలే..

రాజకీయాల్లో చంద్రబాబు, వైయస్ జగన్, కెసిఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవికి అభిమానుల సంపద దండిగా ఉన్నప్పటికీ వారి ముగ్గురిలా రాజకీయాలను ఒక కుదుపు కుదిపే సత్తా చాటలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టిన బస్సు యాత్ర కూడా రాజకీయాలను మలుపు తిప్పే స్థితి లేదు. పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి ఎంతగా ప్రభావం చూపగలిగారనే అభిప్రాయం కలిగిందో ఇప్పుడు అంత లేదు.
చంద్రబాబు తన రాజకీయ చాతుర్యం ద్వారా, ఎత్తుగడల ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఆయనకు ఆ సత్తా ఉందనే భావన గట్టిగానే ఉంది. ఆయన జాతీయ స్థాయిలో రాజకీయ నేతలను కూడగట్టగలరు. చిరంజీవి ప్రభావం పెరగకుండా ఎప్పటికప్పుడు ఎత్తులు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. నందమూరి కుటుంబ సభ్యులను తన చెప్పుచేతుల్లో ఉంచుకుంటూ పార్టీకి గ్లామర్ అద్దుతున్నారు.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా తనకు ఉన్న అనుచర గణంతో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఆయన కార్యకలాపాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవాడనికి ఆయన ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనేది ఆయన తక్షణ ఆకాంక్ష.
తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఏది మాట్లాడినా వివాదం చెలరేగుతూనే ఉంటుంది. సమయం చూసి మాటల తూటాలు వదులుతున్నారు. దాంతో కొంత రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతాయి. తన ప్రాబల్యం తగ్గుతుందని భావించినప్పుడు ఆయన వేగంగా కదులుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆయన మాటలకు, చేతలకు కూడా ఎక్కడలేని ప్రాధాన్యం ఉంది.












Click it and Unblock the Notifications