కేంద్రానికీ గండమే!
డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ప్రకటన చేయడంతో ముసలం మొదలైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ప్రాంతాలవారీగా చీలిపోయి శీతాకాలం సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశారు. దీంతో పార్లమెంటు శీతాకాలం సమావేశాలను నిర్వహించలేని స్థితి ఏర్పడింది. లోకసభను స్పీకర్ మీరా కుమార్ అర్థాంతరంగా వాయిదా వేశారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలను అలా నిర్వహించడం, వాయిదా వేయడం సాధ్యం కాదు. మార్చి 1వ తేదీ లోగా కేంద్ర బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. బడ్జెట్ ఆమోదం పొందాలంటే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటించారు. అంటే తెలంగాణ సమస్యకు ఈలోగా పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.
తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించాలంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించక తప్పదు. బిల్లు ప్రతిపాదించకపోతే రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల నుంచే కాకుండా బిజెపి సభ్యుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రధాన ప్రతిపక్షం బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించింది. శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణపై చర్చ జరిగింది. తెలంగాణపై పార్లమెంటులో చేసిన ప్రకటన కట్టుబడాలని బిజెపి సభ్యులు తీవ్రంగా పట్టుబట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యులు తెలంగాణకు, సమైక్యవాదాలకు అనుకూలంగా రాజీనామాలు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ కారణాలతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ సభ్యులతో పాటు బిజెపి సభ్యులు తోడైతే ఈ సంక్షోభం తప్పదు. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, సీమాంధ్ర నాయకులను ఒప్పించి తెలంగాణకు బిల్లు ప్రతిపాదించడం లేదా తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించి కాలపరిమితిని నిర్దేశించడం జరగాలి.