తెలంగాణ ఎవరికి కావాలి?
ప్రస్తుతం తెలంగాణ విద్యార్థుల నుంచి ఇంత పెద్ద యెత్తున ఉద్యమం రావడం వెనక ఇమిడి ఉన్న ప్రయోజానాలేమిటనే ప్రశ్న వస్తుంది. దాని వల్ల సమాజంలో మార్పేమీ రాదని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వంటి ఆదర్శవాదులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ప్రస్తుత ఉద్యమాన్ని నడిపిస్తున్న విద్యార్థులను సామాజిక పరంగా విశ్లేషిస్తే దానికి సమాధానం దొరుకుతుంది. తెలంగాణలోని సంపన్న రెడ్డి, వెలమ కులాలకు చెందిన వారికి నిజానికి తెలంగాణ రాష్ట్రం వల్ల కొత్తగా ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవు. ఇప్పటికే ఈ రెండు కులాలకు చెందిన యువత అంతా విదేశాలకు వెళ్లిపోయి సురక్షితంగా జీవితంలో స్థిరపడింది. కొద్ది మంది శూద్ర రెడ్డి కులానికి చెందిన విద్యార్థులతో పాటు ఎస్సీ, బిసి, మైనారిటీ విద్యార్థులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వారే ప్రధాన నాయకత్వ స్థాయిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కూడా ప్రయోజనం కలిగేది ఆ కులాలవారికే. అందుకే ఈ ఉద్యమానికి ఒక హేతుబద్దత చేకూరుతోంది.
అగ్రవర్ణ విద్యార్థులు చాలా వరకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో సామాజిక శాస్త్రాలు అభ్యసించడం లేదు. వృత్తివిద్యా కోర్సుల్లో చేరిపోయి ఏదో రకంగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడమో, విదేశాలకు తరిలపోవడం జరిగింది. ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నది బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులే ఎక్కువ. అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దొరికేది, ప్రభుత్వ ఉద్యోగాలు దొరికేది ఎక్కువగా ఈ కులాలవారికే. సామాజిక తెలంగాణ అనే చిరంజీవి నినాదం గానీ, దళితులకు నాయకత్వం లభించాలని కంచ ఐలయ్యలాంటి వారి డిమాండ్ కు గానీ విద్యార్థి ఉద్యమంలోనే సమాధానం లభిస్తుంది. ఉద్యమం మాత్రం వెలమ, రెడ్డి కులాలు కలిస్తేనే ముందుకు సాగుతోంది. రాజకీయ రంగంలో ఆధిపత్యం సాగిస్తోంది ఈ రెండు కులాలవారే. అందువల్ల అగ్ర కుల నాయకత్వాలను తమకు అనుకూలంగా వ్యవహరించడానికి వీలుగా విద్యార్థి ఉద్యమం, ప్రజా సంఘాల ఉద్యమం అనుకోకుండానే ఒక ప్రాతిపదికను తయారు చేసుకుంది.