ఏకమైన వైయస్ జగన్ ప్రత్యర్థులు

ఈనాడు దినపత్రిక ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. తెలుగుదేశం పార్టీలో సర్వత్రా నిర్వేదం అలుముకుందనేది ఆ వార్తాకథనం సారాంశం. చంద్రబాబు మారాలా, నాయకులు మారాలా అంటూ ఆ పత్రిక ప్రశ్నించింది. ఈ వార్తాకథనం ప్రచురణ వెనక రామోజీ ఆంతర్యమేమిటనేది చాలా మందికి అంతు చిక్కడం లేదు. అయితే, ఇటీవలి కాలంలోని పరిణామాలను పసిగట్టిన చంద్రబాబు దివంగత నేత వైయస్సార్ పై, వైయస్ జగన్ పై విమర్శలను, ఆరోపణలు తగ్గించి, రోశయ్యపై పడుతున్నారు. రాష్ట్రంలోని సమీకరణాలు మారడమే అందుకు కారణమని భావిస్తున్నారు. వైయస్సార్ పై, జగన్ పై తాము చేస్తున్న విమర్శలు రోశయ్యకు పరోక్షంగా లాభిస్తున్నాయని ఆయన భావించి తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా పరోక్షంగా వైయస్ జగన్ కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తారు. ఆయన జగన్ కు మిత్రుడిగా మారలేరు.
వైయస్సార్ హయాంలో రామోజీరావుపై, ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై నిరంతర పోరాటం చేసిన కొంత మంది కాంగ్రెసు నాయకులు చేతులెత్తేశారు. ఈ విషయంలో మౌనంగా ఉండిపోతున్నారు. వైయస్ జగన్ కు పూర్తి మద్దతుగా మాట్లాడుతున్నవారు రెండో శ్రేణి, మూడో శ్రేణి నాయకులు మాత్రమే. వారి మాటలకు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం ఉండదు. సాక్షి చానెల్లో గానీ పత్రికలో గానీ ఎంతగా ప్రచురించినా ఏకపక్ష వాదనగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా జగన్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. రామోజీ రావుకు కెసిఆర్ పూర్తిగా సహకరించడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ రకంగా జగన్ వ్యతిరేకులంతా ఏదో రకంగా ఏకమైన సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications