చంద్రబాబు ప్రారంభించారు, వైయస్ పూర్తి చేశాడు
కాగా, రోడ్ల నిర్మాణాలకు విరివిగా స్థలాలు సేకరించారు. ప్రభుత్వ భూములను పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో ఇవన్నీ ప్రారంభమయ్యాయి. అయితే, వీటిలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు అక్రమాలు జరిగాయా అనే విషయాన్ని నిర్ధారించలేం. చంద్రబాబుకు సన్నిహితులైనవారు లబ్ధి పొంది ఉండవచ్చు. అయితే, వైయస్సార్ హయాంలో జరిగినట్లు మాత్రం జరగలేదు. వైయస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్లకు) భారీగా భూసేకరణ జరిగింది. దేశంలో అత్యధిక సెజ్లు ఆంధ్రప్రదేశ్లోనే రూపు దిద్దుకున్నాయి. ఈ వ్యవహారంలో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు పొందినవారి నుంచి జగన్ లబ్ధి పొందారనేది ప్రధానమైన ఆరోపణ.
అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన భారీ పరిశ్రమలేవీ రూపుదిద్దుకోలేదు. ఫ్యాబ్ సిటి, వోక్స్ వ్యాగన్, సైన్స్ సిటీ వంటి పలు భారీ పరిశ్రమలు వస్తున్నట్లు వైయస్ ప్రకటించారు. వాటికి భూములు కేటాయించే పని కూడా చేశారు. ఎక్కడెక్కడ ఆ పరిశ్రమలు వస్తున్నట్లు ప్రకటించారో దానికి ముందే ఆయా ప్రాంతాల చుట్టుపక్కల వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైనవారు భూములు కొనుగోలు చేసి వైయస్ ప్రకటన వెలువడిన వెంటనే అమ్మేసి గణనీయంగా లాభాలు సాధించారని అంటారు. ఆ తర్వాత పరిశ్రమలేవీ రాకపోవడంతో విలువ తగ్గి భూములు కొన్నవారు దివాళా తీశారని చెబుతారు. మొత్తం మీద, ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, పరిశ్రమలకు పెట్టుబడులను ఆహ్వానించడం అనే వలయం పెద్ద తమాషాగా మారింది. రైతులు తక్కువ ధరకు భూములు కోల్పోయి రియల్ ఎస్టేట్ వ్యారారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.