కాంగ్రెసు ఎంపిలకు కెసిఆర్ భయం
తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ను కూడా నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. కోదండరామ్ కెసిఆర్ వ్యూహానికి అనుగుణంగా, తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తీరా రాజీనామాలు చేసిన తర్వాత ఏదో సాకు చూపి తమపై తెరాస అభ్యర్థులు పోటీకి దిగితే ప్రమాదం వాటిల్లుతుందని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారు.
కెసిఆర్ మాట నిలబడరనే అభిప్రాయం ఉంది. రాజకీయాలను, పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎంతటికైనా తెగిస్తారని అంటున్నారు. అందువల్ల తాము రాజీనామాలు చేస్తే మొదటికే మోసం రావచ్చునని కాంగ్రెసు ఎంపిలు అనుకుంటున్నారు. జులై 5వ తేదీన తెలంగాణ కోసం నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షలను భగ్నం చేస్తే రాజీనామాలు చేయాలనే ఆలోచన కూడా చేశారు. అయితే, కెసిఆర్ వైఖరిపై భయంతో వారు మీమాంసలో పడ్డట్లు తెలుస్తోంది. ఏమైనా, కెసిఆర్ వారికి కచ్చితమైన భరోసా ఇస్తారా, తన పార్టీకి ప్రయోజనం కలిగించే విధంగా వారిని వాడుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.