తెలంగాణపై చంద్రబాబుకు ఊరట

తెలంగాణవాదం కాస్తా తక్కువగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలను ఈసారి చంద్రబాబు తన రైతు పోరు బాట కార్యక్రమానికి ఎంచుకున్నారు. రెండో విడత తెలంగాణవాదం ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాలను ఎంచుకోవచ్చునని అంటున్నారు. ఆ రకంగా ఆయన తెలంగాణలో పర్యటించి క్యాడర్లో విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి, ఈ జిల్లాల్లో చంద్రబాబుకు ఏ విధమైన ప్రతిస్పందన లభిస్తుందో ఇప్పుడే చెప్పలేం. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు, తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడనంత వరకు చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మబోరని తెరాస నాయకులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును పోలవరం టెండర్ల విషయంలో ఇరకాటంలో పెట్టామని, నైతికంగా దెబ్బ తీయగలిగామని తెలుగుదేశం నాయకత్వం భావిస్తోంది. ఈ స్థితిలో తెలంగాణలో తిరిగి తమ బలాన్ని పునరుద్ధరించుకునే వ్యూహాన్ని అమలు చేయాలని అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదనే గట్టి నమ్మకంతో కూడా చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ ఉద్యమం వేడి తగ్గుతుందని కూడా ఆయన నమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తన పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణలో పర్యటించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications