కాదంటూనే కెసిఆర్ను ఫాలో అవుతున్న టిడిపి
ఉప ఎన్నికల వ్యూహంతో రాజీనామాల అంశం తెరపైకి తీసుకు వచ్చిన తెలంగాణ జెఏసి ట్రాప్లో మొదటిసారే టిడిపి నేతలు పడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఇష్టం ఉన్నా లేక పోయినా ట్రాప్లో పడాల్సిన పరిస్థితి టిడిపికి ఏర్పడిందని చెప్పవచ్చు. జెఏసి విసిరిన రాజీనామాలకు ధీటుగా స్పందించిన టిటిడిపి జూలై 4న మొదటిసారి అన్ని పార్టీల కంటే ముందుగా రాజీనామా చేసి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. టిడిపి తర్వాత కాంగ్రెసు, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేశారు. తామే మొదట రాజీనామా చేశామని టిటిడిపి నేతలు చెప్పుకున్నారు. అయితే స్పీకర్ రాజీనామాలు మూకుమ్మడిగా తిరస్కరించడంతో తెలంగాణ జెఏసి మరోసారి రాజీనామాలు చేయాలని నేతలకు పిలుపునిచ్చింది. అయితే రెండోసారి మాత్రం రాజీనామాలపై అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటూ, కాంగ్రెసు చేస్తే మేం చేస్తామంటూ, సంక్షోభం కోసమే చేస్తామంటూ చెబుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. మొదటిసారి జెఏసి ట్రాప్లో పడి రాజీనామాలు చేసినప్పటికీ రెండోసారి తప్పించుకుంది.
అయితే టిఆర్ఎస్, జెఏసి చేపట్టే ఆందోళనలలో పాల్గొనబోమని చెబుతూ వస్తున్నప్పటికీ పాల్గొనాల్సిన పరిస్థితి వారికి తప్పటం లేదు. ఒకవేళ వారు ప్రత్యేకంగా ఆందోళనలు చేపడతామని నిర్ణయించుకున్నా తెలంగాణ ప్రజలు వారికి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. టిడిపిలో ఉండాలనుకుంటే చంద్రబాబును ఒప్పించాలి లేదా టిడిపిని వీడి తెలంగాణ కోసం ఉద్యమించాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారు టిఆర్ఎస్, జెఏసి చేపట్టే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మంగళవారం నాటి సకల జనుల సమ్మెలోనూ టిటిడిపి పాల్గొంది. సకల జనుల సమ్మెకు మద్దతుగా సచివాలయాన్ని ముట్టడించి అరెస్టయ్యారు. టిఆర్ఎస్, జెఏసిల పట్ల వ్యతిరేకత ఉన్నా అవి చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో తమ నిబద్దత చూపించాలనే తాపత్రయంలో టిటిడిపి నేతలు ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల్లో వారి పట్ల విశ్వాసం కలగక పోవడం కొసమెరుపు.