కాదంటూనే కెసిఆర్‌ను ఫాలో అవుతున్న టిడిపి

K Chandrasekhar Rao
తెలంగాణ తెలుగుదేశం ప్రస్తుతం ఆత్మ రక్షణలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయాలను అనుకరించే పరిస్థితిలో పడిపోయింది. తాము తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని అయితే టిఆర్ఎస్, జెఏసితో మాత్రం తమకు సంబంధం లేదని ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళతామని పలుమార్లు గొంతు చించుకున్నప్పటికీ కెసిఆర్, కోదండరామ్ నిర్ణయాలను ఫాలో చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. రాజీనామాల నుండి ప్రారంభిస్తే సకల జనుల సమ్మె వరకు అంతా వారు తెలంగాణ జెఏసి నిర్ణయాలతో ఏకీభవించనప్పటికీ వారి బాటలోనే నడుస్తుండటం విశేషం. బస్సుయాత్ర మినహా వారు ఇప్పటి వరకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమంటూ ఏదీ లేదు. ఆ బస్సు యాత్రకు కొంత స్పందన వచ్చినప్పటికీ తెలంగాణవాదులు ఆటంకాలు కలిగించారు. ఆ ఊపులో తమకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని టిటిడిపి నేతలు భావించారు. కానీ కెసిఆర్ వ్యూహాల ముందు అది బెడిసి కొట్టింది.

ఉప ఎన్నికల వ్యూహంతో రాజీనామాల అంశం తెరపైకి తీసుకు వచ్చిన తెలంగాణ జెఏసి ట్రాప్‌లో మొదటిసారే టిడిపి నేతలు పడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఇష్టం ఉన్నా లేక పోయినా ట్రాప్‌లో పడాల్సిన పరిస్థితి టిడిపికి ఏర్పడిందని చెప్పవచ్చు. జెఏసి విసిరిన రాజీనామాలకు ధీటుగా స్పందించిన టిటిడిపి జూలై 4న మొదటిసారి అన్ని పార్టీల కంటే ముందుగా రాజీనామా చేసి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. టిడిపి తర్వాత కాంగ్రెసు, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేశారు. తామే మొదట రాజీనామా చేశామని టిటిడిపి నేతలు చెప్పుకున్నారు. అయితే స్పీకర్ రాజీనామాలు మూకుమ్మడిగా తిరస్కరించడంతో తెలంగాణ జెఏసి మరోసారి రాజీనామాలు చేయాలని నేతలకు పిలుపునిచ్చింది. అయితే రెండోసారి మాత్రం రాజీనామాలపై అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటూ, కాంగ్రెసు చేస్తే మేం చేస్తామంటూ, సంక్షోభం కోసమే చేస్తామంటూ చెబుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. మొదటిసారి జెఏసి ట్రాప్‌లో పడి రాజీనామాలు చేసినప్పటికీ రెండోసారి తప్పించుకుంది.

అయితే టిఆర్ఎస్, జెఏసి చేపట్టే ఆందోళనలలో పాల్గొనబోమని చెబుతూ వస్తున్నప్పటికీ పాల్గొనాల్సిన పరిస్థితి వారికి తప్పటం లేదు. ఒకవేళ వారు ప్రత్యేకంగా ఆందోళనలు చేపడతామని నిర్ణయించుకున్నా తెలంగాణ ప్రజలు వారికి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. టిడిపిలో ఉండాలనుకుంటే చంద్రబాబును ఒప్పించాలి లేదా టిడిపిని వీడి తెలంగాణ కోసం ఉద్యమించాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారు టిఆర్ఎస్, జెఏసి చేపట్టే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మంగళవారం నాటి సకల జనుల సమ్మెలోనూ టిటిడిపి పాల్గొంది. సకల జనుల సమ్మెకు మద్దతుగా సచివాలయాన్ని ముట్టడించి అరెస్టయ్యారు. టిఆర్ఎస్, జెఏసిల పట్ల వ్యతిరేకత ఉన్నా అవి చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో తమ నిబద్దత చూపించాలనే తాపత్రయంలో టిటిడిపి నేతలు ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల్లో వారి పట్ల విశ్వాసం కలగక పోవడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+