వైయస్ జగన్ అనుభవ రాహిత్యం
ముస్లింలకు బిజెపి సిద్ధాంతం పెద్ద అభ్యంతరమనే విషయాన్ని జగన్ ఎందుకు గ్రహించలేకపోతున్నారనేది ప్రశ్న. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని, ముస్లింలు హిందూత్వను అంగీకరించాలనే బిజెపి ప్రాథమిక సూత్రాలను ఆయన విస్మరించారా, ముస్లింలకు ఆ విషయాలు పట్టబోవని ఆయన అనుకున్నారా అనేది అర్థం కావడం లేదు. నిజానికి, ముస్లింలు హిందువులతో సమానంగా హక్కులను, జీవించే హక్కును కోరుకుంటున్నారు. తాము పుట్టి పెరిగిన భారతదేశంలోనే తాము రెండో స్థాయి పౌరులుగా ఉండిపోతున్నామని, బిజెపి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని వారు అనుకుంటున్నారు. అందువల్ల రిజర్వేషన్లు అనేవి బిజెపి విషయంలో అంత ప్రధానమైనవి కావు.
బిజెపి పొత్తు విషయాన్ని జగన్ ఈ దశలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది అసలు ప్రశ్న. బిజెపితో పొత్తు విషయాన్ని ప్రస్తావించకుండా ఆయన కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలను దాటలేకపోయారా అనేది సందేహం. అలా ప్రకటించాల్సిన ఒత్తిడి ఆయన మీద ఏమైనా ఉందా అనేది కూడా అనుమానమే. అలాంటి ఒత్తిడి లేనప్పుడు బిజెపితో పొత్తు విషయం ప్రస్తావించడం ద్వారా తన అనుభవరాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏమైనా, ఈ విషయంలో వైయస్ జగన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లే. ముస్లింలు జగన్ ప్రకటన వల్ల పునరాలోచనలో పడినా ఆశ్చర్యం లేదు.