చిరు, జగన్: '14పై బాబుకు విశ్వాసం సడలిందా?
చంద్రబాబు వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నట్లుగా ఉందని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అంటున్నారు. ఓ ప్రాంతీయ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉంటే ఆ పార్టీకి అది నష్టమే అని అంటున్నారు. రెండు పర్యాయాలు అధికారం లేకపోయినప్పటికీ టిడిపి క్యాడర్ బలంగా ఉందని మరికొందరు చెబుతున్నారు. అయితే బాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు 2014లో గెలుపుపై నమ్మకం సడలిందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అంటున్నారు.
ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు 2009లో రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో తమను దెబ్బతీశారని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో దెబ్బతీయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు జగన్ ద్వారా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పడం ద్వారా బాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని అంటున్నారు.
2009లో చిరంజీవి కారణంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదని సుస్పష్టం. అయితే టిడిపి అధినేతగా ఉన్న బాబు తాము చిరంజీవి కారణంగానో.. జగన్ కారణంగానో దెబ్బతింటున్నామని చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. చిరంజీవి, జగన్ వల్ల దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పడం ద్వారా బాబు వారి వ్యక్తిగత ఇమేజ్ మరింత పెంచుతున్నారనే వాదన వినిపిస్తోంది.
అప్పుడు చిరంజీవి ఇప్పుడు జగన్ వల్ల దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పిన బాబు.. ఉప ఎన్నికలలో కేవలం జగన్నే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెసు పార్టీని విమర్సించినప్పటికీ నామమాత్రంగానే. ఆయన ప్రధానంగా జగన్ అవినీతి పైనే దృష్టి సారించి దానిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావించారు. అయితే జగన్ అవినీతి అంశాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
2009లో చిరంజీవి కారణంగా అధికారానికి దూరమైన బాబు ఉప ఎన్నికలలో అయినా, భవిష్యత్తులో అయినా జగన్ తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతాడని భావించే ఆయనను టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. అదే చంద్రబాబు మళ్లీ జగన్పై సానుభూతి కురిసినప్పటికీ భవిష్యత్తులో అది ఉండదని చెబుతున్నారు. బాబు పార్టీని కాకుండా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకోవడం వల్ల లాభం లేకుండా పోయిందని అంటున్నారు.