జగన్ను కార్నర్ చేసేందుకు అదే దారిలో
మజ్లిస్ కంటే ముందే రాష్ట్రంలోని క్రిస్టియన్ సామాజిక వర్గం వైయస్ జగన్ వైపు వెళ్లిందన్న భావనతో కాంగ్రెసు పార్టీ ఉంది. మజ్లిస్ పార్టీ వ్యవహారంతో ఇటు క్రిస్టియన్, అటు ముస్లిం రెండు వర్గాలు దూరం అయ్యాయనే ఆందోళనలో ఉన్నదని అంటున్నారు. జగన్ ప్రభావం కేవలం రాష్ట్రానికే పరిమితమైనప్పటికీ మజ్లిస్ ప్రభావం మాత్రం దేశం మొత్తం కాంగ్రెసు పార్టీ పైన పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దీంతో కాంగ్రెసు ద్వారానే మైనార్టీలకు(అల్పసంఖ్యాకవర్గాలకు) న్యాయం జరుగుతుందన్న ప్రచారానికి ఆ పార్టీ తెరలేపనుందని చెబుతున్నారు. ఆ వర్గాలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెసు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కాంగ్రెసు వైపు ఉంటారని చెప్పేందుకు రాష్ట్రంలో త్వరలో భారీ ప్రార్థన సభ నిర్వహించే సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. క్రైస్తవులు, ముస్లింలు ఇతర పార్టీలకు మద్దతు తెలిపితే జాతీయస్థాయిలో బిజెపి బలపడుతుందనే హెచ్చరిక కాంగ్రెసు చేయనుందని తెలుస్తోంది.
రాష్ట్రంలో జగన్కు ఓటు వేస్తే అది కాంగ్రెసుకు నష్టాన్ని తెస్తుందని తద్వారా అల్పసంఖ్యాక వర్గాలు నష్టపోతారని చెప్పనుందట. వైయస్ తన పాలనలో క్రైస్తవులకు చేసిందేమీ లేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బైబిల్ను ప్రతి రాజకీయ కార్యక్రమానికి తీసుకు వెళ్తున్నారని, ఇది సరైనది కాదనే చర్చ కూడా కాంగ్రెసు వైపు మొగ్గుచూపుతున్న క్రైస్తవ నేతలు చెబుతున్నారట.
కాంగ్రెసు పార్టీ అవసరాన్ని క్రైస్తవులకు వివరించే నిమిత్తం భారీ స్థాయిలో సాధ్యమైనంత త్వరగా ప్రార్థనా సభను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చర్చిలలో ప్రార్థనలు చేశారని, ఆయన పార్టీకి అనుకూలంగా చెప్పాలనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కూడా జగన్ను ఫాలో అవుతూ.. జగన్కు ధీటుగా క్రైస్తవులను తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు చేయనుందని అంటున్నారు.