ధర్మాన ప్రసాదరావు కమిటీ ఇక హుష్ కాకి

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇక లేనట్లేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే తన సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చవి చూడడంతో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ధర్మాన కమిటీని పిసిసి అధ్యక్షుడు నియమించారు.
ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని తాత్కాలికంగా నియమించిన కమిటీయేనని బొత్స అన్నారని తెలిసింది. అయితే ఈ కమిటీ 2014 వరకు ఉంటుందని, ప్రభుత్వానికి, పార్టీకి అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటుందని మంత్రి ధర్మాన చెప్పడం గురించి పార్టీ నాయకులు బొత్సను ప్రశ్నించగా, తాను ఆ విధంగా ఎక్కడైనా చెప్పానా? అని ఆయన వారిని ఎదురు ప్రశ్నించారట.
గ్యాస్ కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి లేఖ రాయడంలో తప్పు లేదని ఆయన అన్నారని తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ అనధికారికంగా లీక్ కావడం, మీడియాలో రావడం గురించి ప్రశ్నించగా, అటువంటిది తన దృష్టికి రాలేదని, అయినా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తానని ఆయన చెప్పారని తెలిసింది.
ఎఐసిసి నాయకుడు, పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గాంధీ భవన్ ఆవరణలో దీక్ష చేపట్టేందుకు రావడం తనకు సమాచారం లేదని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతను కూడా వైఎస్ చేపట్టాలనుకున్నారని ఆయన అన్నట్లు తెలిసింది. రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్ చేపట్టినప్పుడు ఈ పేరు బాగా లేదని తామే అన్నామని ఆయన చెప్పారు. రచ్చబండ అంటే అంతా రచ్చరచ్చ అవుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications