'జగన్' సాక్షి ప్రకటననే ఉచ్చులోకి లాగుతోందా!?

అంతకుముందే సిబిఐ ప్రత్యేక కోర్టు ఆస్తుల కేసులో ఈ నెల28న నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరవ్వాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ల స్తంభన మరుసటి రోజే ప్రభుత్వం సాక్షి మీడియాకు ప్రకటనలు రద్దు చేసింది. ఆ తర్వాత సిబిఐ సాక్షి మీడియా ఉద్యోగుల వివరాలు అందించాలంటూ కార్మిక శాఖకు లేక రాసింది. సిబిఐ లేక నేపథ్యంలో పూర్తి వివరాలు అందించేందుకు కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది.
ఆదివారం కూడా పని చేసి సోమవారం లోగా సాక్షి మీడియా ఉద్యోగుల వివరాలను సిబిఐకి ఇవ్వనుంది. ఇందుకోసం ఏడుగురు సంయుక్త కమిషనర్లు, 24 మంది సహాయ కమిషనర్లు రేయింబవళ్లు సమాచారం సేకరిస్తున్నారు. సాక్షి మీడియాలో ప్రత్యక్షంగా ఎందరు, పరోక్షంగా ఎందరు పని చేస్తున్నారో, వారి వేతనాలు, ఉద్యోగ వివరాలు, పిఎఫ్, ఈఎస్ఐ వంటి వివరాలను కార్మిక శాఖ తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సాక్షి మీడియాకు చెందిన ఐదు సంస్థల వివరాలను ఇప్పటికే సేకరించారు. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్లో 126 మంది, సాక్షి టీవీని నడిపే ఇందిరా టెలివిజన్ను నడిపే ఇందిరా టెలివిజన్లో 540 మంది ఉద్యోగులు, రిజల్యూట్ మీడియాలో 837 మంది ఉద్యోగులు, గార్నెట్ మీడియాలో 1047 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. జనని టివి వివరాలను రాబట్టాల్సి ఉంది.
సాక్షి ఛత్రం కింద దాదాపు అరవై వేల ఉద్యోగులు పని చేస్తున్నారని, వారంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో విధులు నిర్వహిస్తున్నారని సాక్షి యాజమాన్యం చెబుతోంది. ఆ పత్రికలో వెయ్యి మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు లేరని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరులో వ్యాఖ్యానించిన వెంటనే పత్రిక యాజమాన్యం ఈ వివరాలు ఇచ్చింది. రెగ్యులర్, క్యాజువల్ ఉద్యోగులు 8,700, పేపర్ ఏజెంట్లు 13,000, పేపర్ బాయ్స్ 28,000, హాకర్లు 19,000 దాకా ఉన్నారని సాక్షి యాజమాన్యం తెలిపింది.
ఇప్పుడు ఆ వివరాలను పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్న కార్మిక శాఖ ముమ్మరంగా ఆ ప్రయత్నాలలో ఉంది. యాజమాన్యం ప్రకటననే ధువీకరణగా పరిగణిస్తూ ఆదివారం సైతం శ్రమించి వివరాలను రాబట్టే పనిలో ఉందని తెలుస్తోంది. తమ సంస్థ కింద అరవై వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారని సాక్షి యాజమాన్యం ఇచ్చిన ప్రకటనే అనూహ్యంగా ఆ సంస్థను మరో ఉచ్చులోకి నెట్టేసిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి యాజమాన్యం తమ ఉద్యోగుల విషయంలో ఏమాత్రం చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా జగన్ చుట్టూ మరో చట్ర బంధం తయారు కావడం ఖాయమంటున్నారు. తాము హ్యాకర్లకు సైతం ఎంతో కొంత గౌరవ వేతనం ఇస్తున్నామని, వారిని సైతం ఉద్యోగులుగానే పరిగణించాలని సాక్షి గతంలో తెలిపింది. ఇప్పుడు కూడా అదే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు ఆ హాకర్ల వద్ద నుంచి రెగ్యులర్గా పని చేస్తున్న వారందరికీ ప్రావిడెంట్ ఫండ్ జమ అయ్యే విషయంపై అందరి దృష్టి పడిందని అంటున్నారు.
అంతేకాక ఈఎస్ఐ వంటి సదుపాయాలు, ఉద్యోగ విధుల సమయాలు, సెలవుల వంటి వాటిపై సైతం కార్మిక చట్టాల ప్రకారం నిఘావేసి పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటున్నారని, ధైర్యంగా ఎదుర్కోలేకే కేసులు పెడుతున్నారని జగన్ చేస్తున్న ప్రచారాన్ని ఈ రకంగా తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. చట్టబద్దంగా జగన్ను ఇరికించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications