తిరుగు టపా: టిడిపి వైపు చూస్తున్న జయప్రద?
తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెళ్ళిన ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లోకి రావడమే కాకుండా అదీ తన సొంతగూడు టిడిపిలోకే రానున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మంచి నాయకుడని, గతంలో మంచి పాలన అందించారని కితాబు ఇచ్చారు. అంతేకాదు తాను చంద్రబాబుకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆయనను వ్యతిరేకించినట్లా అని చెప్పారు. తన రాజకీయ జీవితం రాష్ట్రం నుంచే ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయ రంగప్రవేశానికి భగవంతుడ్ని వేడుకుంటానని చెబుతూ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు బాలకృష్ణ పైనా ఆమె స్పందించారు. బాలయ్య అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఆయన ఎప్పుడు పిలిచినా తాను వెళ్లి మద్దతు పలుకుతానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెప్పారు.
జయప్రద 1993లో టిడిపిలో చేరారు. ఆ తర్వాత 1996లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయాలని తలచిన ఆమెకు ఆశాభంగం ఎదురైంది. ఆ సమయంలో ఆమెకు సమాజ్వాదీ పార్టీ ఆహ్వానం పలికి ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ బరిలో నిలిపింది. హిందీ సినిమా రంగంలో మంచి పేరు గడించిన ఆమె ఆ సానుకూలతతో అక్కడ సునాయాసంగా గెలిచారు. అదే స్థానం నుంచి రెండోసారి 2009లో కూడా గెలిచిన ఆమెకు ఇటీవల ఇబ్బందులు మొదలయ్యాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్తో విభేదించి అమర్సింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అమర్సింగ్తో కలిసి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2010 ఫిబ్రవరి 2న పార్టీకి జయప్రదను దూరం పెట్టారు.
దీంతో యుపి రాజకీయాల్లో తాను నెగ్గుకురాలేనని తలచినట్లుగా ఉన్నారు. అందుకే ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెడుతున్నారంటున్నారు. బాబు గురించి ఆమె సానుకూలంగా మాట్లాడటం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. టిడిపిలో చేరితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె ఏదో ఒక ఎంపి సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆమెను చేర్చుకొంటే ములాయంతో ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఒకరిద్దరు నేతలు అంటున్నా ఎక్కువ మంది మాత్రం ఆమె రావడం పార్టీకి ఉపకరిస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇంతవరకూ జయప్రదతో రాజకీయపరమైన చర్చలేవీ జరగలేదని టిడిపి అంటోంది. ఆంధ్రప్రదేశ్ అంటే తనకు ఎంత ఇష్టమని జయప్రద అన్నారు.