జగన్ దరికి క్యాంప్: అటు సోనియా ఇటు రాహుల్
చర్చల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా భాగస్వామి అవుతున్నారట. సోనియా గాంధీ ప్రధానంగా మాజీ పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. డిఎస్ పిసిసి చీఫ్గా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారని, అందుకే అతను అయితేనే బాగుంటుందని ఆమె ఆలోచిస్తున్నారట. పైగా ఆయన పట్ల వ్యతిరేకతతో ఉన్న వారు ఎక్కువగా లేరని చెబుతున్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన వర్గం, డిఎస్ వర్గంగా ఉండేది. ఇప్పుడు వైయస్ఆర్ వర్గం దాదాపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లింది. దీంతో పార్టీలో అతనికి పదవి కట్టబెడితే నో చెప్పే వారు పెద్దగా ఉండరని సోనియా భావిస్తున్నట్లుగా ఉన్నారని అంటున్నారు. తెలంగాణకు చెందిన బిసి వ్యక్తి కావడంతో ఇటు తెలంగాణలో, అటు బిసిలో కాంగ్రెసు పట్ల సానుకూలత ఏర్పడుతుందని భావిస్తున్నారట.
అయితే రాహుల్ గాంధీ ఆలోచన మరో విధంగా ఉందట. మర్రి శశిధర్ రెడ్డి అయితే బెట్టర్ అనే భావనలో ఆయన ఉన్నారట. శశిధర్ రెడ్డి మేధావి అని, చాకచక్యంగా, చురుగ్గా ఉంటారని రాహుల్ భావిస్తున్నారట. కానీ తెలంగాణవాదులు శశిధర్ రెడ్డిని అంగీకరించరని పలువురు రాహుల్ దృష్టికి తీసుకు వెళ్తున్నారట. శశిధర్ రెడ్డి కాదనుకున్నా డిఎస్కు మాత్రం రాహుల్ నో చెప్తున్నారట. ఆయన ప్రస్తుతం ప్రజల్లో చురుగ్గా తిరగలేదనేది రాహుల్ వాదనగా కనిపిస్తోందని అంటున్నారు.
వీరిద్దరికీ కాకపోతే పంచాయతీరాజ్ శాఖమంత్రి జానా రెడ్డికే కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించినా రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండానే 'కాపు' కాయాలని చూస్తున్నారట. డి శ్రీనివాస్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగించాలని, అలాకాకుండా మర్రి లేదా జానాకు సిఎం పదవి ఇస్తే కన్నా లక్ష్మీ నారాయణను పిసిసిగా చేయాలని భావిస్తున్నారట. తద్వారా పార్టీలో కాపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లే కాకుండా రెడ్డిని దూరం చేసుకోకుండా ఉంటుందని భావిస్తున్నారట.