తెలంగాణపై చంద్రబాబు వైఖరి మారుతోందా?
తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖను మరోసారి ఇవ్వాలని పార్టీ నేతలు సూచించారట. అలా ఇస్తే పార్టీ తెలంగాణలు మళ్లీ పుంజుకుంటోందని వారు బాబు దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ ప్రజలు పార్టీని ఆదరించలేదని, ఈ అంశంపై ఒక స్పష్టమైన వైఖరి మనం చెప్పకుంటే పార్టీ మరింత దిగజారుతోందని వారు బాబుకు సూచించినట్లుగా సమాచారం. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. తెలంగాణ బాధ్యత టిడిపి పైన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. పార్టీ తెలంగాణ ప్రాంతంలో మళ్లీ పుంజుకోవాలంటే గతంలో ఇచ్చిన లేఖనే మరోసారి ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారట. అయితే ఆ లేఖలో ఏం మార్పులు చేయాలనే అంశంపై ఆయన ఇరు ప్రాంతాల పార్టీల నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.
లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించిన మీదట కేంద్రానికి దానిని పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేఖలో తెలంగాణకు అనుకూలంగా, సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేలా చూస్తున్నారట. చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆత్మహత్యల పైన కూడా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా తెలంగాణ బాగా హీటెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో స్పష్టమైన వైఖరితో లేఖ రాయాలని టి-టిడిపి నేతలతో పాటు సీమాంధ్ర నేతలు కూడా సూచిస్తున్నారట. అలా అయితేనే రాష్ట్రంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారట. ఈ కారణంగానే తెలంగాణపై క్రమంగా బాబు వైఖరి మారినట్లుగా కనిపిస్తోంది.