జగన్తో ఢీ: ఆ నలుగురు కాంగ్రెస్ను గెలిపిస్తారా?

ఇప్పటికే కాంగ్రెసు పార్టీ ముఠా ముసలంలో కొట్టుమిట్టాడుతుంది. అందుకే ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా సంపూర్తి కాలేదు. అభ్యర్థుల జాబితాలో పైచేయి సాధించిన ముఖ్యమంత్రి, ఆయన జాబితాను ఆమోదించిన ఆజాద్, ఇక్కడ విభేదించి అక్కడ వారితో కలిసి పని చేసిన బొత్స పార్టీ అభ్యర్థుల జయాపజయాలకు ఎంత బాధ్యత తీసుకుంటారనే ప్రశ్నలు పార్టీలో తలెత్తుతున్నాయి. అదే సమయంలో అధిష్టానం ఏరికోరి చిరంజీవిని తెచ్చుకుంది. గత ఉప ఎన్నికలలో ఆయన సినీ ఇమేజ్ ఏమాత్రం పని చేయలేదు. మరి ఇప్పుడు పని చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
సీమాంధ్రలో జగన్ బలంగా ఉండటంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాలలో వెన్నాడుతున్న అసమ్మతి ఎక్కడ పుట్టి ముంచుతోందనన్న భయం కాంగ్రెసులో ఉందంటున్నారు. పరకాలలో బలం ఉన్న తమను కాదని టిడిపి నుంచి వచ్చిన సమ్మారావుకు టిక్కెట్ ఇవ్వడం గండ్ర వెంకట రమణ రెడ్డి వర్గానికి ఆగ్రహం తెప్పించింది. అక్కడ వారు సహాయ నిరాకరణ చేస్తే పరిస్థితి తారుమారు అవడం ఖాయం.
ఇక తిరుపతిలో తన తనయుడు గల్లా జయదేవ్కు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మంత్రి గల్లా అరుణ కుమారి వెంకట రమణకు చేయిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెంకట రమణకు సహకరించే అవకాశాలే లేవంటున్నారు. మాచర్లలో పిన్నెల్లి లక్ష్మారెడ్డికి చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన పున్నా రెడ్డి ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే.
కడప జిల్లాలో అయితే మరీ దారుణం. జిల్లా మంత్రుల మధ్య ఏమాత్రం సమన్వయం లేదు. అభ్యర్థిని గెలిపించడం కన్నా ముందు వారు పోట్లాడుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రత్యర్థ పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా కాంగ్రెసు మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కడపలో అభ్యర్థులను గెలిపించే బాధ్యతను డిఎల్ ముఖ్యమంత్రి, ఇంచార్జ్ మంత్రుల పైనే వేశారు. రాజంపేట, రాయచోటిలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఇరు పార్టీలో రెడ్డి వర్గానికి చెందిన వారే. టిడిపి వ్యూహాత్మకంగా బలిజలకు సీట్లు ఇచ్చింది. దీంతో స్థానిక కాంగ్రెసు నేతలు చిరంజీవి వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
తొలుత చిరంజీవి తాను ఐదు నియోజకవర్గాలలో గెలుపు బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. కానీ ఆ తర్వాత సమష్టి కృషి అని చెప్పారు. పిఆర్పీ ఓట్లు కాంగ్రెసుకు పడతాయా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతొంది. తిరుపతిలో గెలిపించుకోవడం చిరంజీవికి ప్రాధానం. అలాగే సోనియా హెచ్చరించినందున కిరణ్, బొత్స, ఆజాద్లకు ఉప ఎన్నికలు పెను సవాలే. సరైన ఫలితాలు రాకపోతే కఠినమైన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని నాయకత్వం చేసిన హెచ్చరికల నేపథ్యంలో నేతలంతా గెలుపుపై ప్రధానంగా దృష్టి సారించారు. జగన్తో ఢీకొని కాంగ్రెసును ఈ నలుగురు గెలిపిస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications