వంశీ, మోహన్‌బాబుతో జగన్: కన్ఫ్యూజ్‌లో బాబు?

YS Jagan-Chandrababu Naidu
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో చాలాచోట్ల జగన్ పార్టీ హవానే కొనసాగుతుందని, నాలుగైదు చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపొందనున్నదని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపికి ఆ అవకాశం కూడా లేకుండా జగన్ పక్కా వ్యూహంతో వెళుతున్నారని అంటున్నారు.

గుంటూరులో పెదరత్తయ్య నుండి మొదలు ఆదివారం మోహన్ బాబు వరకు జగన్ టిడిపి క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టే విధంగా వెళుతున్నారని అంటున్నారు. గుంటూరు జిల్లాలో టిడిపిలో ప్రధానంగా ఉన్న పెదరత్తయ్యను జగన్ తన పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రత్తయ్య ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆయన తిరిగి టిడిపిలోకే వచ్చే అవకాశముందని అంటున్నారు. పలుమార్లు ఆయన టిడిపిలో తిరిగి జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. అయితే ఎప్పటికైనా ఆయన మళ్లీ సొంతగూటికి తిరిగి వచ్చే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం జగన్‌ను వల్లభనేని వంశీ బహిరంగంగానే కలవడం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన జగన్ వైపు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే వల్లభనేని వంశీ మాత్రం పార్టీ మార్పు వార్తలను ఖండించారు. తాను టిడిపిలోనే ఉంటానని, జగనే మొదట వాహనం దిగి తనవైపు వచ్చారని, దీంతో మన సాంప్రదాయం ప్రకారం సంస్కారం కాదనే ఉద్దేశ్యంతోనే ఆయన వద్దకు తాను వెళ్లి విష్ చేశానని చెప్పారు.

జగన్‌ను ఆలింగనం చేసుకోలేదన్నారు. ఈ అంశంపై తాను చంద్రబాబుకు వివరణ ఇస్తానని చెప్పారు. తాజాగా ఆదివారం మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. గతకొంతకాలంగా మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఆయన ఇంటికి వెళ్లడంతో సమీకరణాలు ఏమైనా మారనున్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఇటీవల విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబురావు టిడిపికి రాజీనామా చేశారు.

సీమాంధ్రలో దూకుడుగా ఉన్న తమ పార్టీకి మరింత ఇమేజ్ తీసుకు వచ్చే వ్యూహంలో భాగంగా జగన్ పలువురిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వంశీని, మోహన్ బాబును కలిశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా నేతలు పార్టీని వీడతారో లేదో కానీ జగన్ మాత్రం ఇలాంటి చర్యల ద్వారా చంద్రబాబును, పార్టీ క్యాడర్‌ను తీవ్ర గందరగోళంలో పడేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకవిధంగా ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల ఉప ఎన్నికలలో టిడిపి నష్టపోతుందని, జగన్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+