జగన్పై చిర్రుబుర్రు: వైఎస్ వీర విధేయులకు గాలం
అలాగే గతంలో జగన్ కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసిన కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆమెకు కూడా గాలం వేస్తున్నారట. కొండా మురళి పట్ల కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినాయకత్వం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. వీరిద్దరూ వైయస్కు అత్యంత సన్నిహితులు. అలాంటి వీరి అసంతృప్తి చర్చనీయాంశమైంది. జగన్ పార్టీనిస్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కంటే వైయస్తో స్నేహానికే కొణతాల ప్రాధాన్యం ఇచ్చారు.
ఆ పార్టీని ప్రజలెంత వరకూ విశ్వసిస్తారో అనే ఆలోచనకు తావివ్వకుండా కాంగ్రెస్కు గుడ్బై చెప్పి జగన్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. అర్థవంతమైన చర్చలు, మీడియా సమావేశాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కొణతాల తప్పనిసరిగా ఉండాల్సిందే. జగన్ కోసం మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవినీ త్యాగం చేసిన కొండా సురేఖ.. ఉప ఎన్నికల్లో తెరాసను గట్టిగా ఢీకొని, అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
జగన్, విజయమ్మలపై ఎవరైనా మాటల దాడి చేస్తే వారిపై ప్రతిదాడికి కొండా సురేఖను ప్రయోగించేవారు. అయితే, ఇప్పుడు ఇటు కొణతాలకు గానీ, అటు కొండా దంపతులకు గానీ తగినంత ప్రాధాన్యం దక్కడం లేదట. విశాఖ జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొణతాల, తెలంగాణలో బలమైన నేతలుగా గుర్తింపు పొందిన కొండా దంపతులను కాంగ్రెస్లోకి తీసుకురావాలని ఆ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా వారితో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కొండా దంపతులను పార్టీలోకి రప్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ నేత ప్రయత్నాలు ప్రారంభించారట. కొండా దంపతుల సమీప బంధువుల ద్వారా కాంగ్రెస్లోకి రప్పించేందుకు మంతనాలు జరుగుతున్నాయట. ఇదే సమయంలో కొణతాలను కూడా రప్పించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ నెల 3వ తేదీన ఒక ఐఏఎస్ అధికారి కుమారుని వివాహ రిసెప్షన్లో ఎదురుపడిన కొణతాలను పలకరించిన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో సత్తిబాబు నివాసానికి కొణతాల వెళ్లారు. కొణతాలతో పాటు మేధావి వర్గంగా పేరొందిన మరో జగన్ పార్టీ నేత కూడా ఆ రోజు భేటీలో పాల్గొన్నారట. ఈ భేటీలో జగన్ పార్టీలో దాడి చేరిక నుంచి ఇతర అంశాలు చర్చకు వచ్చాయట.
ఈ విషయం తెలుసుకున్న విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం రాత్రి పిసిసి చీఫ్ బొత్సతో సమావేశమయ్యారు. కొణతాలను తీసుకొస్తే జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని గంటా అభిప్రాయపడ్డారు. కిరణ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. కొణతాల మాత్రం వైయస్తో ఉన్న అనుబంధాన్ని ఒక్క క్షణంలో తెంచేసుకోగలరా అనే సందేహాలు నెలకొన్నాయి. ఆయన అనుచరులు మాత్రం దాడితో కలిసి పనిచేసేందుకు అస్సలు అంగీకరించడం లేదు.