'టి'కి 'భారీ' ప్యాకేజీ: లెక్కలతో కట్టిపడేసిన కిరణ్

ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడం, ప్రతి జిల్లాకూ ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల, మరో ఇంజనీరింగ్ కళాశాల, సాగునీటికి పెద్దపీట వేయడం.. ఇలా పలు అంశాలతో రోడ్ మ్యాప్ను ఆయన అధిష్ఠానానికి సమర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారా పొందే ప్రయోజనాల కన్నా.. ప్రత్యేక ప్యాకేజీతోనే తెలంగాణ ప్రజలు ఎక్కువ లబ్ధి పొందుతారని కోర్ కమిటీ భేటీలో అధిష్ఠానానికి కిరణ్ వివరించారట.
భారీ ప్యాకేజీ ద్వారా 80 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతాయని, దీంతో అనేక ఉపయోగాలు ఉన్నాయని అధిష్ఠానానికి స్పష్టం చేశారట. తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి ఈ ప్యాకేజీ దోహదపడుతుందని, దీనిద్వారా సామాజిక న్యాయం అందుతుందని చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అదనంగా నిధులు ఉంచి వాటిని ఈ ప్యాకేజీ అమలుకు వెచ్చించాలని కిరణ్ సూచించారట.
ప్యాకేజీలోని 78 శాతం నిధులను తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఖర్చు చేయాలని, విద్య, నైపుణ్యం పెంపుదల, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, నీటి పారుదల రంగ అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారట. ప్యాకేజీలో రూ.85,500 కోట్లను తెలంగాణలోని నీటిపారుదల రంగానికి ఖర్చు చేసి 97 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును అభివృద్ధిలోకి తీసుకు రావొచ్చునన్నారట.
తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలను నెలకొల్పి బలహీన వర్గాల వారికి విద్యను అందుబాటులోకి తీసుకు రావాలని, నైపుణ్యం పెంపుదల, స్వయం ఉపాధి పథకాల కోసం రూ.2,500 కోట్లు తెలంగాణ ప్రాంతానికి కేటాయించాలని సూచించారట. విద్యుత్ ఉత్పాదనకు, విద్యుత్ రంగం బలోపేతానికి, విద్యారంగంలో అభివృద్ధికి, వైద్యం, ఆరోగ్యానికి, ఉద్యోగ రంగం.. ఇలా ఒక్కోదానికి ఎంత ఖర్చు పెట్టి అభివృద్ధి చేయవచ్చునో కూడా కిరణ్ తన రోడ్ మ్యాప్లో వివరించారట.












Click it and Unblock the Notifications