కెవిపి, లగడపాటిల్ని బోనెక్కించే ప్రయత్నాల్లో..
తెలంగాణను అడ్డుకుంటున్న వీరిని కోర్టులకు ఈడ్చాలని తెరాస భావిస్తోందట. దీనికి సంబంధించి పార్టీ లీగల్ సెల్కు బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఓ వైపు పైకి కెవిపి పైన బహిరంగ విమర్శలు గుప్పిస్తూనే లోలోపల ఆయన లక్ష్యంగా తెరాస పక్కా ప్రణాళిక రచిస్తోందట. కెవిపి, లగడపాటి, కావూరిల చుట్టూ కేసుల ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సీమాంధ్ర త్రయం వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాల్లో అవకతవకలపై కూపీలాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారి వ్యాపారాలు, వ్యవహారాలన్నీ సక్రమమేనా? ఏ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డారు? వాటిపై కోర్టుకు వెళితే ఎలా ఉంటుంది? కోర్టు దీనిపై విచారణకు స్వీకరిస్తుందా? అనే కోణంలో తెరాస చర్చలు జరిపిందట. వివిధ శాఖల్లోని తెలంగాణ అనుకూల అధికారులు, సమాచార హక్కు చట్టం, ఇతరత్రా మార్గాల ద్వారా వివరాలు రాబట్టి విషయం తేల్చాలని నిర్ణయించింది. వీటన్నింటినీ పరిశీలించి, కేసులు వేసే బాధ్యతను పార్టీ లీగల్ సెల్కు అప్పగించినట్లు తెలిసింది.
బుధవారం తెరాస శాసనసభ్యుడు హరీశ్ రావు ల్యాంకోపై తీవ్ర ఆరోపణలు చేశారు. లగడపాటికి చెందిన ఈ సంస్థకు విద్యుత్ సంస్థ అదనపు చెల్లింపులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కెవిపి వైఖరిని తెలంగాణ వాదులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఎప్పుడూ తెరవెనుక ఉండే ఆయన తెలంగాణ విషయంలో మాత్రం తెర ముందు చురుగ్గా కదులుతున్నారు. ఢిల్లీలో ఆయనకు ఉన్న పలుకుబడి, పరిచయాల దృష్ట్యా సీమాంధ్ర నేతలు కూడా కెవిపి పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ నేతల ఆగ్రహానికి కెవిపి ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ కెవిపిపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. కానీ వైయస్ హయాంలో వ్యవహారాలన్నీ చక్కబెట్టింది కెవిపియేనని విపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. జగన్ కేసులో కెవిపి పైనా దర్యాప్తునకు ఆదేశించేలా తగిన ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
కోర్టు విచారణకు ఆదేశిస్తే జగన్ లాగే ఆయన ఇరుక్కుంటారని భావిస్తున్నారట. అన్నింటికంటే ముఖ్యంగా... లగడపాటి, కెవిపి, కావూరిలాంటి వారిపై ఎదురుదాడికి దిగుతూ, కేసుల్లో కూరుకుపోయేలా చేస్తే, వాటిని నుంచి బయటికి రాలేక, తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను తమంతట తామే మానుకుంటారన్నది తెలంగాణ రాష్ట్ర సమితి నేతల వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.