జగన్కు వాస్తు కష్టాలు: గాలి దారిలోనే...(పిక్చర్స్)
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది మే 27న అరెస్టయినప్పటి నుండి సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ మార్చి 31వ తేదీలోగా తుది ఛార్జీషీటు దాఖలు చేయాల్సి ఉంది. అయితే, సిబిఐ మాత్రం తమకు తుది గడువు ఇవ్వలేదని చెబుతోంది.
తుది ఛార్జీషీటు దాఖలుకు సుప్రీం కోర్టు తుది గడువు ఇచ్చిందని చెబుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బెయిల్ కోసం ఈ నెలలో దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే జగన్కు బెయిల్ రాకపోవడానికి వాస్తుదోషం కూడా కారణం కావచ్చునని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. చివరికి వాస్తునూ ఆశ్రయించారట. ఈ మేరకు జగన్ నివాసంలో పెద్దఎత్తున వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.
లిఫ్టులు, గోడల తొలగింపు, పునర్నిర్మాణం సహా అనేక మార్పుచేర్పులు చేపట్టినట్లుగా సమాచారం. లోటస్ పాండులోని అత్యాధునిక ఇంటివల్లే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు కష్టాలు వస్తున్నాయని జగన్ పార్టీలోని కొందరు నేతలు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారట. వాస్తుపై నమ్మకం లేని జగన్ వాటిని మొదట కొట్టిపారేశారట. దివంగత వైయస్ కూడా వీటిని నమ్మేవారు కాదు.
బంజారాహిల్సులోని వైయస్ తన సొంతింట్లో ఉన్నన్నాళ్లు అప్పుడు అధికారం అందలేదట. ఆయన అప్తమిత్రుడు కెవిపి రామచంద్ర రావు అప్పట్లో వైయస్ను ఒప్పించి తన ఇంటి వెనుక ఉన్న కుమార్తె నివాసానికి మార్చారట. ఆ తర్వాతే వైయస్కు అధికారం అందిందని చెబుతున్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ కొంతకాలం అదే భవనంలో ఉన్నారు. అక్కడున్నంత వరకు జగన్కు ఇబ్బందులు రాలేదని, కొత్త ఇంటిలోకి వచ్చాకే సమస్యలు చుట్టుముట్టాయంటున్నారు.
జగన్ జైలుకు వెళ్లడం, షర్మిల జనాల్లోకి వెళ్లడం, గాయాలపాలు కావడం, సిబిఐ దాడులు, ఈడి ఆస్తుల జప్తు ఇవన్నింటికి వాస్తు దోషమేనని కొందరు నేతలు కుటుంబ సభ్యులకు సూచించారట. విజయమ్మ, జగన్ వాటిని వినకపోయినప్పటికీ వైవి సుబ్బారెడ్డితో చెప్పి ఒప్పించి ఇప్పుడు వాస్తుకు అనుకూలంగా మార్చారట. వాస్తుకనుకూలంగా మార్చడంతో ఇప్పుడు తమకు బాగుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.
కాగా, గతంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా తాను జైలుకు వెళ్లడానికి కారణం తన ఇంటికి ఉన్న వాస్తుదోషమే కారణమని భావించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన జైలుకు కారణం వాస్తు దోషమేనని భావించిన గాలి తన కుటుంబ సభ్యులకు చెప్పి బళ్లారిలోని తన ఇంటికి వాస్తుకనుకూలంగా మార్పులు చేపించారు. ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యులు కూడా వాస్తుకనుకూలంగా మార్పులు చేపించారని అంటున్నారు.
టిడిపి వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాకపోవడానికి కారణం వాస్తుదోషమేనని భావించిన టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణ అధినేత చంద్రబాబు నాయుడును ఒప్పించి పార్టీ కార్యాలయానికి వాస్తుమార్పు చేపించిన విషయం తెలిసిందే. ఐదారు నెలల క్రితం టిడిపి కార్యాలయానికి వాస్తుమార్పులు జరిగాయి. ఇప్పుడు అదే బాటలో జగన్ పార్టీ నడిచిందంటున్నారు. వాస్తు దోషం కారణంగా పలు పార్టీలు, రాజకీయ నాయకులు కార్యాలయాలను, ఇండ్లను వాస్తుకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
జగన్, విజయమ్మలకు వాస్తుపై నమ్మకం లేకున్నా పార్టీ నేతలు వాస్తు కారణంగానే కష్టాలు అని చెప్పి ఒప్పించారట.
జగన్ ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
వైయస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కెవిపి ఒప్పించి వాస్తుమార్పులు చేయించారట. ఆ తర్వాతే అధికారం దక్కిందట.
గాలి జనార్ధన్ రెడ్డి వాస్తు దోషం కారణంగానే జైలుకెళ్లానని భావించి ఇంటి ఆవరణలో నిర్మించుకున్న రాజకీయ కుటీరాన్ని తొలగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది గతేడాది జూన్లో జరిగింది.
వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైన టిడిపి కార్యాలయంలో వాస్తు దోషం ఉందని భావించి బాలకృష్ణ కార్యాలయానికి మార్పులు చేపించారు.
శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయంలో వాస్తు దోషం ఉందని, ఆ కారణంగానే నేతలు కార్యాలయానికి రావడం లేదనే వార్తలు గతంలో వచ్చాయి.