ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాయచోటి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రద్దైన లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గం నుండి లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాలు రాయచోటి నియోజకవర్గంలో చేరాయి. ఇక, ఈ నియోజకవర్గంలో స్వాతంత్ర సమరయోధులు ఆది నారాయణ రెడ్డి, నాగిరెడ్డి, నారాయణరెడ్డి రెండు సార్లు చొప్పున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక, పాలకొండ్రాయుడు ఇక్కడి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత పార్లమెంట్ కు వెళ్లారు. కడప జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎన్నిక ల నిర్వహణ..ఫలితాలు ఎప్పడూ ఆసక్తి కరమే. ఇక, 2009 లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన శ్రీకాంత్ రెడ్డి వైసిపి అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామల్లో 2012 లో వైసిపి నుండి ఉప ఎన్ని కల్లో పోటీ చేసి గెలిచారు. 2014 లోనూ వైసిపి అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు.
16 సార్లు ఎన్నికలు.. 2.25 లక్షల ఓటర్లు..
1952 లో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం లో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 8 సార్లు, టిడిపి రెండు సార్లు, వైసిపి రెండు సార్లు, స్వతంత్ర పార్టీ- జనతా పార్టీ - కెయంపిపి లు ఒక్కోసారి గెలుపొందాయి. వీరితో పాటుగా స్వతంత్ర అభ్యర్ధి సైతం ఒకసారి గెలిచారు. 2014 ఎన్నికల లెక్కల ప్రకారం రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 225388 ఓటర్లు ఉన్నారు. ఇక, గత మూడు సార్లుగా జరిగిన ఎన్నికల్లో జి శ్రీకాంత రెడ్డి వరుసగా గెలుస్తూ వచ్చారు.
2014 లో 75 శాతం పోలింగ్..వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 225388 ఓట్లు ఉండగా, అందులో 170516 ఓట్లు పోలయ్యాయి. ఇక, ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 83682 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 86833 గా నమోదైంది. 2014 ఎన్నికల్లో మొత్తం గా 75.65 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, 2014 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన జి శ్రీకాంతరెడ్డికి 96891 ఓట్లు రాగా , టిడిపి నుండి పోటీ చేసిన రమేష్ కుమార్ రెడ్డికి 62109 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ది శ్రీకాంత్ రెడ్డి 34782 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. శాసనసభలో జగన్ తో పాటే ఉండే శ్రీకాంత్ రెడ్డ వైసిపి ఏర్పడిన తొలి నాటి నుండి పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో ముఖ్యులుగా ఉన్నారు. జగన్ కు సన్నిహితుడిగా నియోజకవర్గంలో పేరున్న శ్రీకాంత్ రెడ్డి ఉన్నత విద్యా వంతుడు.