ఎదుటి శిబిరంలో తమ్ముడు: చిరంజీవి వెలుగుతారా?
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవిని అభిమానులు ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటారు. సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తున్నారు. కాంగ్రెసుకు సీమాంధ్రలో ప్రస్తుతం ఆయనే పెద్ద దిక్కు అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన ద్వారా ఆయన 2008లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
సామాజిక న్యాయ సాధనే తన పార్టీ లక్ష్యమని చెబుకుంటూ 2009 ఎన్నికల్లో 104 మందికి శాసనసభా టికెట్లు ఇచ్చారు. నిరుపేద గిరిజన మహిళ తుపాకులు మునెమ్మకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి సంచలనం సృష్టించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి చిరంజీవి విజయం సాధించారు. అయితే, పాలకొల్లుతో మాత్రం ఓటమి చవి చూశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుని వైఫల్యంగా ముందుకు వచ్చింది.
ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోయినా నిరాశకు గురి కాని చిరంజీవి రాజకీయాల్లో కొనసాగారు. అయితే, 2011లో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమం, వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు స్థాపన నేపథ్యంలో కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో సోనియా గాంధీ చిరంజీవిని చేరదీశారు.
పార్టీ విలీనం చేసిన ఏడాది తర్వాత చిరంజీవిని కాంగ్రెసు పార్టీ 2012 మార్చి 29వ తేదీన రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్ 28వ తేదీన ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరారు. స్వతంత్ర ప్రతిపత్తితో పర్యాటక శాఖను చేపట్టారు. చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర వరప్రసాద్.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లో 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించిన చిరంజీవి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. నర్సాపూర్లోని వైఎన్ కాలేజీలో కామర్స్లో డిగ్రీ పట్టా తీసుకున్న ఆయన చెన్నైకి వెళ్లి 1976 మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరారు. తమ కుటుంబం ఆంజనేయ స్వామిని పూజిస్తుండడం వల్ల తెర మీద చిరంజీవి పేరు పెట్టుకోవాలని తల్లి ఆయనకు సూచించారు.
కాంగ్రెసుకు పెద్ద దిక్కుగా మారిన చిరంజీవికి ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎదురు పక్షంలో నిలిచారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు దాదాపుగా తెలంగాణకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇక సీమాంధ్రలో ప్రచారం సాగించే అవకాశం ఉంది. చిరంజీవికి వ్యతిరేకంగా నిలిచి ఆయన ప్రచారం సాగించనున్నారు.
చిరంజీవి తెలుగు సినిమాల్లోనే కాకుండా ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజ్, జెంటిల్మెన్ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఇంద్ర, కూలీ వంటి సినిమాలు హిందీలోకి డబ్బయ్యాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు రక్త, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో చాలా బలహీనంగా ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పూర్తిగా దెబ్బ తిన్నది. ఈ స్థితిలో కాంగ్రెసుకు జవజీవాలు పోయాల్సిన బాధ్యత చిరంజీవిపై పడింది. ఈ స్థితిలో సీమాంద్రలో కాంగ్రెసు భవిష్యత్తుపై చిరంజీవి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని చెప్పడంలో సందేహం లేదు.