కెసిఆర్పై కాంగ్రెస్ పొరపాటు!: ఆ రోజు ఏం జరిగింది?
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.. రెండేళ్లు తిరిగేసరికి తెలంగాణలో తెరాసను తిరుగులేని పార్టీగా నిలబెట్టారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ పొరపాటు కేసీఆర్కు వరమైందంటున్నారు.
2013లో తెలంగాణ ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. 2014లో పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి పాస్ చేయింది. ఈ నేపథ్యంలో బిల్లు పెట్టిన కాంగ్రెస్, సహకరించిన బీజేపీ, తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్, ఇతర ఉద్యమ నేతలను తెలంగాణ ప్రజానీకం ఆకాశానికెత్తింది.
ఇదే సమయంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకింత అత్యుత్సాహానికి పోయిందని అంటున్నారు. తెలంగాణ వస్తే మనకు తిరుగులేదని, మనమే గెలుస్తామని తెలంగాణ నేతలు కాంగ్రెస్ అధినేత్రికి చెప్పారు.
తెలంగాణ ఇచ్చినందున నాడు సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్.. ఆనాడు తెరాస అధినేత హోదాలో సోనియాను ఆమె ఇంటికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ విలీనం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
అంతకుముందు కేసీఆర్ పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తాను తెరాసను విలీనం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రిని ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుటుంబంతో సహా వెళ్లి మరీ కలిశారు. తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తారని భావించారు.
అయితే, అనూహ్యంగా కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా.. ఒంటరిగా పోటీ చేసి, అధికారం చేపట్టారు. కష్టంగానే అధికారం చేపట్టినా.. రెండేళ్లలో పది జిల్లాల్లో గులాబీ దండు పెరిగింది. విపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. విపక్షాల జాడ లేకుండా పోయింది.
నాడు ఏం జరిగింది?
కొన్నిసార్లు పార్టీలు లేదా రాజకీయ నాయకులు చేసే పొరపాట్లు వైరి పక్షాలకు లాభం చేకూరుస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు కేసీఆర్కు వరమైందని చెబుతున్నారు.
కేసీఆర్ తన కుటుంబంతో కలిసి 2014 మార్చి నెలలో సోనియా గాంధీని కలిశారు. తెలంగాణను ఇచ్చినందుకు ఆయన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, తెలంగాణ ఇచ్చినందుకు విలీనానికి కూడా సిద్ధమని సోనియాతో చెప్పారని అంటారు.
ఈ విషయమై దిగ్విజయ్ సింగ్తో చర్చించాలని సోనియా సూచించారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి కేసీఆర్.. దిగ్విజయ్తో మాట్లాడేందుకు నాలుగు రోజులు వేచి చూశారని తెలుస్తోంది. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
కేసీఆర్ చర్చల కోసం నాలుగు రోజులు వేచి చూశారు. అయినా కాంగ్రెస్ నుంచి సమాధానం లేదు. తెలంగాణ ఇచ్చినందున అధికారం మాదేనని కాంగ్రెస్ నేతలు అతి విశ్వాసానికి పోయారని అంటున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ను పక్కన పెట్టాలని భావించారని, అందుకే ఆయన ప్రతిపాదనకు స్పందించలేదని అంటున్నారు.
తెలంగాణ ఇచ్చినందున ఎవరి మద్దతు లేకుండా తాము గెలవడం ఖాయమని కాంగ్రెస్ భావించింది. దిగ్విజయ్ నుంచి, కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇప్పుడు, ఓ ముఖ్యమంత్రిగా కెసిఆర్.. విమర్శల కంటే ప్రశంసలు ఎక్కువగా అందుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ చేసిన పొరపాటు కేసీఆర్కు వరం అయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కెసిఆర్ పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు.
బొటాబొటి మెజార్టీ నుంచి ఇప్పుడు ఏకంగా తెలంగాణలో విపక్షం లేని స్థాయికి తెరాసను తీసుకు వచ్చారని చెబుతున్నారు. తెలంగాణ రాకముందు నాలుగు జిల్లాల్లో పట్టు ఉండేది. ఇప్పుడు అది మొత్తం పది జిల్లాలకు చేరుకుంది. తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లు కూడా కెసిఆర్ పట్ల సానుకూలంగా ఉండటం గమనార్హమని చెబుతున్నారు.