చిచ్చు: కిరణ్‌తో ఢిల్లీ తాడోపేడో, రేసులో ఇద్దరు?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడుతున్నారట. నిన్నటి వరకు విభజన తీరును బహిరంగంగా సవాస్ చేసిన కిరణ్ ఇప్పుడు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాయడంపై అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఆలోచించి కిరణ్‌కు చెక్ పెట్టాలని భావిస్తోందట. ఎప్పటి నుండో ముఖ్యమంత్రిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా కిరణ్ లేఖతో ఇక కిరణ్‌ను ఇంటికి పంపించాల్సిందేననే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందంటున్నారు. అంతేకాదు ఢిల్లీ పర్యటనలో గవర్నర్ నరసింహన్ కూడా ముఖ్యమంత్రి పైన ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కిరణ్‌ను తప్పించి విభజనపై ముందుకు వెళ్లాలని అధిష్టానం భావిస్తోందంటున్నారు. దీంతో రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు రాబోతున్నారా!? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Kiran Kumar Reddy - Sonia Gandhi

కిరణ్ స్థానంలో మరొకరిని కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోందనే ప్రచారం సాగుతోంది. విభజనపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ఏకపక్షంగా ముందుకు వెళ్లరాదని రాష్ట్రపతిరవ, ప్రధానికి కిరణ్ రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై వివరణ కోరుతూ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాష్ట్రపతి లేఖ రాశారు. ఈ లేఖపై సోనియా గాంధీ ఆగ్రహంగా ఉండటంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై సీరియస్‌గా దృష్టి పెట్టారట.

కిరణ్ పైన వేటు వేస్తేనే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడుతున్నారుట. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా కిరణ్ రాసిన లేఖపై స్పందించలేదు. సిఎం రాసిన లేఖను చూడలేదని, చూసిన తర్వాత స్పందిస్తానంటూ ఆయన దాట వేశారు. దీంతో, అధిష్ఠానం పకడ్బందీగా కిరణ్‌కు చెక్ చెప్పేందుకు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అధిష్ఠానం ప్రత్యామ్నాయ నాయకుడి వేటలో పడిందంటున్నారు.

సీమాంధ్రలో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న నాయకుడిని ముఖ్యమంత్రిగా రంగ ప్రవేశం చేయించాలని అధిష్ఠానం యోచిస్తోందట. రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరా రెడ్డి, కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయట. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఢిల్లీలో ఉన్నారు. మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపారట. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా సిఎం పదవికి వినిపిస్తున్నప్పటికీ మళ్లీ రెడ్డి వర్గం వారికే ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదంట!

దీంతో, రఘువీరా, కన్నా పేర్లలో ఒకరి పేరు ఖరారు కావొచ్చంటున్నారు. వచ్చే వారమే అధిష్ఠానం రాష్ట్ర పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకువచ్చి, సిఎల్పీ సమావేశం నిర్వహిస్తుందని, కొత్త సిఎం ద్వారానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+