పాదయాత్రల సెంటిమెంట్: అధికారానికి జగన్కు అదే మెట్టు
గతంలో నాయకులు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పాదయాత్రలు జరిపేవారు. యావత్ భారతావనికి అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2003 నుంచి 2014 వరకు రాజకీయ పార్టీల నాయకుల పాదయాత్
హైదరాబాద్/ అమరావతి: గతంలో నాయకులు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పాదయాత్రలు జరిపేవారు. యావత్ భారతావనికి అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2003 నుంచి 2014 వరకు రాజకీయ పార్టీల నాయకుల పాదయాత్ర వారి భవిష్యత్ చిత్రాన్నే మార్చేసింది. ఇది అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పార్టీల నాయకులకు ఒక బలమైన సెంటిమెంట్గా మారింది.
2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, ఈనాటి ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మండుటెండల్లో పాదయాత్ర చేపట్టారు. 1999 ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నినాదం ఇవ్వలేకపోయినందుకు కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది.
నాటి పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి.. రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయంపై అన్వేషించారు. 'ప్రజా ప్రస్థానం' పేరుతో రంగారెడ్డి జిల్లా 'చేవెళ్ల' నుంచి శ్రీకాకుళం జిల్లా 'ఇచ్చాపురం' వరకు 1460 కిలోమీటర్ల దూరం వరకూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జరిపిన సుదీర్ఘ పాదయాత్ర ఆయన భవితవ్యాన్నే మార్చేసింది.
2017లో ఇలా వైఎస్ జగన్మోహనరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠ పెంచింది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ దశ, దిశ మార్చేసింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లే, తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ నెల 27వ తేదీన కడప జిల్లాలోని ఇడుపుల పాయలో పాదయాత్ర ప్రారంభించి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించాలని ఆదివారం నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి' సమీపాన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రకటించారు వైఎస్ జగన్.
వైఎస్ఆర్తో ఇలా కాంగ్రెస్ పార్టీ నేతల రాజీ
2004 ఎన్నికల నాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒకరిగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే వరకు నమ్రతతో వ్యవహరించారు. తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకులు సైతం రాజీ పడ్డారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పీ జనార్దన రెడ్డి వంటి వారు మినహా మిగతా వారంతా కలిసిపోయారు. రాష్ట్రంలో విభేదాలెన్ని ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి.
టీడీపీకి అధికారం దూరంచేసిన ప్రజారాజ్యం
2009 ఎన్నికలకు ముందు ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన సాచివేత ధోరణితో అప్పటివరకు మిత్రపక్షాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్ఎస్లతో కలిసి 2009 ఎన్నికల్లో పోటీ చేసినా.. మెగాస్టార్ స్థాపించిన ‘ప్రజారాజ్యం' పార్టీ వల్ల ఓట్లు భారీగా చీలిపోవడంతో రెండోసారి కూడా వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ అనూహ్యంగా 2009 సెప్టెంబర్ రెండో తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులే తీసుకొచ్చింది.
2008లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఇలా
తెలంగాణ రాష్ట్రం కోసం ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బహిర్గతం అయ్యాయి. దాని కొనసాగింపుగా 2004లో జరిగిన ఎన్నికల్లో 25 అసెంబ్లీ, ఐదు లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందడం, తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఓటమి పాలవ్వడంతోపాటు కాంగ్రెస్ విజయం సాధించడం పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చింది. దీంతో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుల్లో మార్పు తీసుకొచ్చింది. 2004 ఎన్నికలకు ముందు ‘తెలంగాణ' పదం వినియోగంపై నిషేధాజ్నలు విధించిన చంద్రబాబు కూడా రాజకీయ ప్రయోజనాల రీత్యా వైఖరి మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని యూపీఏ తొలి విడత ప్రభుత్వం నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ అందజేసింది. దాని ఫలితంగా తెలంగాణలో టీఆర్ఎస్కు బదులు టీడీపీ గెలుపొందింది. 2008లో ‘మీ కోసం' అనే పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటూ అంతర్గత సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగిన చంద్రబాబు నాయుడు.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్ల 2014 వరకు విపక్ష నేతగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది.
2012లో ఎమ్మార్పీఎస్ మద్దతుతో బాబు యాత్ర ఇలా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ప్రతిగా 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నాటి కేంద్ర హోంమంత్రి పి చిదంబరం ప్రకటించడంతో రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చేశాయి. తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన రెడ్డికి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో 2012లో మరోసారి ‘వస్తున్నా మీ కోసం' అనే పేరుతో చంద్రబాబు రెండోసారి రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి.. పార్టీని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 2013 జూలైలో తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఒకవైపు విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తెర వెనుక ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోని పార్టీ శ్రేణులతో జాగరూకతతో వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణలో జేఏసీ నేతల నిరసన మధ్య ఎమ్మార్పీఎస్ మద్దతుతో పాదయాత్ర పూర్తిచేశారు చంద్రబాబు.
వైఎస్ షర్మిల ఇలా మరో ప్రస్థానం
మరోవైపు వైఎస్ మరణంతో బాధపడుతూ మరణించిన వారిని పరామర్శించేందుకు కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ జగన్. తొలుత కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. ఖమ్మం జిల్లా వరకు దిగ్విజయంగా జగన్ పరామర్శ యాత్ర సాగింది. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటనకు సిద్ధం కావడంతో తెలంగాణ వాదులతో రగడ సాగింది. అనివార్యంగా మధ్యలోనే జగన్ తన పాదయాత్ర రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అక్రమాస్తుల కేసులో 2012లో అరెస్టయిన వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. మరో ప్రజా ప్రస్థానం పేరిట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో రెండు విడతల్లో పాదయాత్రచేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనుండటంతో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సజావుగా ఉంటాయా? లేవా? అన్న విషయం ఇప్పుడే ఏమీ చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే డిక్టేటర్ షిప్తో కూడిన పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి పాదయాత్రకు అనుమతినిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.