భాగ్యనగరవాసులకు శుభవార్త..ఇకనుంచి గోవాకు నేరుగా ట్రైన్..
హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లొచ్చు. గోవా వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్తను అందించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ టు వాస్కోడిగామా ట్రైన్ను ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న ప్రతిపాదన ఉండగా ఎట్టకేలకు ఇప్పడు అనుమతి లభించింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ ట్రైన్ ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సర్వీసు వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే ట్రైన్ బుధ, శుక్రవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. వాస్కోడిగామా నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో..
గోవా వెళ్లే ఈ ట్రైన్ కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్లీ, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీకోచ్, 2ఏసీ కోచ్, 3 ఏసీ కోచ్, స్లీపర్ కోచ్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. వీటికి నేటి (అక్టోబర్4) నుంచి టికెట్ల బుకింగ్ కు అనుమతిస్తారు. అక్టోబర్ 6వ తేదీ ట్రైన్ మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది. ప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తున్నారు. ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉండడం విశేషం.












Click it and Unblock the Notifications