ఆరోగ్య శాఖల మంత్రి
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న చికున్ గన్యా వ్యాధిపై ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించిన విషయం విదితమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ వ్యాధి కారణంగా ఇంత వరకు ఎవరూ మరణించిలేదు. కానీ వాస్తవం వేరుగా ఉంది. ఈ వ్యాధి వల్ల చిక్కి శల్యమైన వారు, ఇతర వ్యాధులు ముదరడంతో మరణిస్తున్నారు. చికున్ గన్యా వ్యాధిపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తినప్పుడు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడారు. చివరికి ఆర్ధిక, ఆరోగ్య శాఖల మంత్రి కొణిజేటి రోశయ్య భార్యకు ఈ వ్యాధి సోకినప్పుడు ప్రభుత్వం హడావుడిగా ఐదు కోట్ల రూపాయలను ఈ వ్యాధిని తగ్గించే మందుల పంపిణీ కోసం కేటాయించింది. ఈ వ్యాధి చాలా సహజమైనదని, దీనితో ఎవరూ మరణించరని నీరో చక్రవర్తి లాగా ప్రకటనలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి విషయం తెలిసి వచ్చింది. ఎలా? ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి చికున్ గన్యా వ్యాధి సోకింది. కీళ్ళ నొప్పులతో బాధ పడడం చూసి తెగ బాధ పడిపోయిన వైఎస్ వెంటనే మరో విడత ప్రభుత్వ నిధులను ఈ వ్యాధి నివారణ, చికిత్స కోసం విడుదల చేసినట్టు తెలుస్తోంది. తనదాకా వస్తే గానీ అన్న సామెత ఇక్కడ నిజమైంది.