కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావు
కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావు మళ్ళీ ఒక దిన పత్రికను, దానితో పాటు ఒక టీవీ ఛానల్ను ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు కానీ ఆయన జూబిలీ హిల్స్లో అత్యంత ఖరీదైన బంగళాను నిర్మిస్తున్నారు. రెండేళ్ళుగా నిర్మాణంలో ఉన్న ఆ ఇల్లు పూర్తి కావడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చు. ఆ ఇంటిపై ఇప్పటికే 15 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. సినీ ప్రముఖులు చాలా మంది విశాలమైన, విలాసవంతమైన బంగళాలు కట్టుకున్నారు. కానీ చిరంజీవి ఇంటి తర్వాత స్ధానం దాసరి బంగళాదేనని ఫిల్మ్నగర్ వర్గాల కథనం. చిరంజీవి ఇంటికి 36 కోట్లు ఖర్చయినట్టు తెలుస్తోంది. దాసరి కూడా దాదాపు 30 కోట్లు ఆ ఇంటి మీద ఖర్చు చేయనున్నట్టు చెబుతున్నారు. శ్రీహరి లాంటి చిన్న హీరోలే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇళ్ళు కట్టుకున్నప్పుడు దాసరి వంటి బహుముఖ ప్రతిభావంతుడు గొప్ప ఇల్లు కట్టుకుంటే తప్పేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.