ఉపాధి శాఖ కమిషనర్
ఒక మహిళా అధికారి నడుం కొలతలు అడిగిన ఐఎఎస్ అధికారి, ఉపాధి శాఖ కమిషనర్ ఇప్పుడు సస్పెన్షన్లో ఉండి తన అరచేతి గీతల కొలతలు కొలుసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఆయన లాంటి వికార చేష్టల అధికారులపై ప్రభుత్వం నిఘా వేసినట్టు సమాచారం. మంగపతిరావు లాగా మంది మతితో కాకుండా తెలివిగా, గుట్టు చప్పుడు కాకుండా అందమైన మహిళా ఉద్యోగులను లోబరుచుకుంటూ ఆఫీసు యాంటీ రూముల్లోనే సరసల్లాపాలు సాగిస్తున్న ఐఎఎస్ అధికారులకు సంబంధించిన ప్రాధమిక సమాచారం ఇంటిలిజెన్స్ అధికారుల వద్ద ఉంది. ఇటువంటి విషయాలపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉండడంతో ఈ సమాచారాన్ని ఆయనకు చేరవేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆతృత పడుతున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ల మధ్య ఎంతో కాలంగా నడుస్తున్న పరోక్ష యుద్ధం కూడా దీనికి ఒక కారణం. గతంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన ఒక ఐఎఎస్ అధికారి ఇటువంటి ఆరోపణల మీదే బదిలీ అయి, ఇంటర్మీడియట్ బోర్డుకు బదిలీ అయ్యారు. కుక్కతోక వంకర అన్నట్టు ఆయన ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళి హార్సిలీహిల్స్లో గడిపిన మూడు రాత్రులకు సంబంధించిన రహస్య సమాచారం ప్రభుత్వానికి చేరింది. ఆ జిల్లా నాయకులే ఈ విషయంపై ముఖ్యమంత్రికి ముఖాముఖి వివరించినట్టు తెలిసింది.