అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యలకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అడ్డుపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని జగన్ వర్గానికి ఆయన కొమ్ము కాస్తున్నట్లు మొదటి నుంచీ అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రోశయ్య మాట వినకుండా జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై చర్య తీసుకోలేకపోవడానికి కారణం కూడా అదేనంటున్నారు. జగన్ తో మొయిలీ సంబంధాలు కొనసాగుతుండడంతో ముఖ్యమంత్రి రోశయ్య బాలినేనిపై చర్యలు తీసుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీ వ్యవహారాలకు సంబంధించి మొయిలీతో మాట్లాడలేక, మాట్లాడకుండా చర్యలు తీసుకోలేక ఆయన సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో బాలినేనిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. అయితే, ఇది ఎంతో కాలం సాగకపోవచ్చు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుంచి ఈ నెల 17వ తేదీన మొయిలీని తప్పిస్తారని, ఆ తర్వాత జగన్ వర్గానికి చెందిన మంత్రులపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణను కూడా చేపడతారని అంటున్నారు. మొయిలీని తప్పించిన తర్వాత వైయస్ జగన్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.