తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సినీ నటి రోజా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై చేసిన వ్యాఖ్య ఇప్పటికీ రాజకీయాల్లో హిట్ డైలాగ్ గానే ఉంది. రాత్రి బార్, పగలు దర్బార్ అంటూ ఆమె కెసిఆర్ పై చేసిన వ్యాఖ్య కెసిఆర్ ప్రత్యర్థులకు ఓ ఆయుధంగా మారింది. కానీ, ఇప్పుడు రోజా తన మనసు మార్చుకున్నట్లున్నారు. కెసిఆర్ గొప్పతనాన్ని కూడా గుర్తించినట్లున్నారు. చంద్రబాబును దెప్పి పొడవడానికి కెసిఆర్ ను ముందుకు తెచ్చారు. కెసిఆర్ కున్నపాటి త్యాగబుద్ధి చంద్రబాబుకు లేకపోయిందని ఆమె ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఎత్తి పొడిచారు. తన చెల్లె విజయశాంతి కోసం కెసిఆర్ మెదక్ పార్లమెంటు సీటును త్యాగం చేశారని, చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆమె అన్నారు. తనను గెలిపించుకోవాలనే బుద్ధి కాకుండా తనను ఓడించాలనే బుద్ధితో చంద్రబాబు వ్యవహరించారని ఆమె విమర్శించారు. కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఆర్. చెంగారెడ్డిపై నగరి శాసనసభా నియోజకవర్గంలో తనను తొలుత పోటీకి దించారని, అక్కడ ఓడిపోయానని ఆమె చెప్పారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఆ సీటులోనే తనను పోటీకి దించుతారని తాను నగరిలో చాలా కష్టపడి పునాది ఏర్పాటు చేసుకున్నానని, అయితే తనను అక్కడి నుంచి మార్చి చంద్రగిరి టికెట్ ఇచ్చారని, అది కూడా మంత్రి గల్లా అరుణకుమారిపై తనను పోటీకి దించారని, ఇది చంద్రబాబు చేసిన పని అని ఆమె విమర్శించారు. విజయశాంతి కోసం మెదక్ సీటును వదులుకున్న పాటి త్యాగాన్ని చంద్రబాబు ప్రదర్శించకపోగా, తన ఓటమికి కారణమయ్యారని ఆమె విమర్శించారు. చంద్రగిరి సీటును చంద్రబాబు గానీ, గాలి ముద్దు కృష్ణమ నాయుడు గానీ పోటీ చేసి గెలవగలరా, ఇది తన చాలెంజ్ అని ఆమె అన్నారు.