ఇక కాంగ్రెసు టార్గెట్ వైయస్ విజయమ్మ
ఇక, వైయస్ విజయమ్మపై కూడా విమర్శనాస్త్రాలు సంధించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆవి హద్దు దాటకుండా ఉండేలా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆ విధమైన దాడికి కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని వైయస్ జగన్కు చెప్పాలని ఆయన అన్నారు.
తాను అరెస్టయితే అమ్మ పార్టీ బాధ్యతలు చూసుకుంటారని వైయస్ జగన్ ఇది వరకే చెప్పారు. వైయస్ విజయమ్మ పూర్తి స్థాయిలో ఉప ఎన్నికల ప్రచారంలోకి దిగితే సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో విజయమ్మపై ముందు జాగ్రత్తగా విమర్శనాస్త్రాలు సంధించేందుకు కాంగ్రెసు పార్టీ సిద్ధపడుతున్నట్లు అర్థమవుతోంది. జగన్ను అదుపులో పెట్టలేకపోయారని ఆమెపై కాంగ్రెసు నాయకులు వ్యాఖ్యానించే అవకాశాలున్నాయి.
గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ విజయమ్మపై అటువంటి విమర్శలే చేశారు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని విజయమ్మ అడగాల్సి ఉండిందని, అలా అడిగి ఉంటే జగన్ ఇన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండేది కాదని తెలుగుదేశం నాయకులు గతంలో అన్నారు. ఏమైనా, విజయమ్మ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా కాంగ్రెసు పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కునే అవకాశాలున్నాయి.