జగన్తో హగ్: వల్లభనేని వంశీ వెనుక జూ.ఎన్టీఆర్?

జూనియర్ ఎన్టీఆర్కు వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్యే కొడాలి నాని అత్యంత సన్నిహితులు. గత ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇప్పించేందుకు జూనియర్ గట్టిగా పట్టుబట్టారు. దీంతో రెండు మూడు సీట్లలో సమీకరణాలు మార్చి మరీ విజయవాడ ఎంపి టికెట్ను వంశీకిచ్చారు. కొంతకాలం క్రితం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావుపై వంశీ తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు చేశారు. ఈ దాడి వెనుక కూడా జూనియర్, ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక కూడా ఎన్టీఆర్ ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తాను జగన్ను కలవడం యాదృచ్ఛికమేనని వంశీ చెబుతున్నప్పటికీ అది మాత్రం కాదని అంటున్నారు. జగన్ వచ్చే సమయానికి తాను అక్కడే ఉండేలా వంశీ చూసుకొన్నారని, పదేపదే ఆ సమయంలో అక్కడ సంచరించడం చూసి పోలీసులు అనుమానంతో ఆయన వాహనాన్ని కూడా తనిఖీ చేశారని అంటున్నారు.
జగన్ను కలిసే లక్ష్యంతోనే ఆయన వ్యూహాత్మకంగా అక్కడున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం విడుదల రోజే బందరు పోర్టు సాధన పేరుతో కృష్ణా జిల్లా బంద్కు తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ పిలుపునివ్వడం కూడా ఎన్టీఆర్ వర్గానికి ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వంశీ, నాని ఈ బంద్ పిలుపును ఆక్షేపించారు. అయినా బంద్ కారణంగా విజయవాడ సహా కృష్ణా జిల్లా మొత్తం దమ్ము సినిమా మార్నింగ్ షో నిలిచిపోయింది. గుడివాడలో మాత్రం కొడాలి నాని ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఉదయం నుంచే సినిమాను ప్రదర్శించారు.
సరిగ్గా అదేరోజు సాయంత్రం గన్నవరం రోడ్డులో జగన్, వంశీ ఎదురుపడటం, ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం రాజకీయంగా సంచలనానికి దారితీసింది. టిడిపిలో క్రియాశీలంగా ఉన్న వంశీ ఆకస్మికంగా అదీ బహిరంగంగా జగన్ను కలవడం వెనుక పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టే వ్యూహం ఉందని అంటున్నారు. కొంతకాలంగా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు చంద్రబాబుకు మధ్య దూరం పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. హరికృష్ణ కొంతకాలం క్రితం ఢిల్లీలో టిడిపి నందమూరిదే అన్న వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి.
ఎన్టీఆర్ కుటుంబ వారసులమైన తమకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యాన్ని చంద్రబాబు ఇవ్వడం లేదన్న అభిప్రాయం కూడా వారిలో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును రాజకీయంగా ఒత్తిడికి గురిచేసే వ్యూహంతోనే అందరికీ కనిపించేలా జగన్ను వంశీ కలిసేలా చేశారంటున్నారు. తమవారిని విస్మరిస్తే వెళ్లిపోవడానికి ప్రత్యామ్నాయం ఉందన్న సంకేతం పంపడమే ఈ వ్యవహారం లక్ష్యమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications