కసబ్కు డెంగ్యూ ఫీవర్: ఉరిపై కొత్త కాంట్రవర్సీ
బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు కసబ్ను పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీసినట్లుగా తెలియజేశారు. ఆ తర్వాత రెండు మూడు గంటల్లోనే అతని మృతదేహాన్ని ఎరవాడ జైలులో ఖననం చేశారు. దీంతో డెంగ్యూతో బాధపడుతున్న నిందితుడిని ఎలా ఉరి తీస్తారని అంటున్నారు. అదే నిజమైతే అతను డెంగ్యూతోనే బాధపడుతూ మృతి చెందవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల్లో ఖననం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అతను డెంగ్యూతో మృతి చెందినప్పటికీ లబ్ధి కోసం ఉరి తీసినట్లుగా చెబుతుండవచ్చుననే ప్రచారం మైక్రో బ్లాగింగ్ సైట్లలో జోరుగా సాగుతోంది. ఉరిశిక్ష వేశామని చెప్పిన గంటల్లోనే ఖననం చేశారని మైక్రో బ్లాగింగ్ సైట్లలో పలువురు గుర్తు చేస్తున్నారు. సామాజిక వెబ్ సైట్లలో పలువురు వ్యక్తం చేసిన అభిప్రాయాలు....
1. కసబ్ డెంగ్యూతో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయని, భారత చట్టాలు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఉరి తీసేందుకు అనుమతిస్తున్నాయా? - పవన్ దురాని
2. క్యూరియస్! కసబ్ డెంగ్యూతో మృతి చెందాడా? ప్రభుత్వం కంటితుడుపు చర్యా? - ట్రాన్స్ఫర్ ప్రైసింగ్
3. కొద్ది వారాలుగా కసబ్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. ప్రభుత్వం నిజంగానే అతనికి ఉరిశిక్ష విధించిందా లేక డెంగ్యూతో మృతి చెందాడా? - నీల్ సోనీ
ఏడున్నర గంటల ప్రాంతంలో కసబ్ను ఉరి తీసినట్లుగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్లు చెప్పారు. గంటల్లోనే ఖననం చేసినట్లు చెప్పారు. ఇటీవల కసబ్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వైద్యులు కసబ్ కేవలం సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లుగా ప్రకటించారు. కసబ్ ఉరిశిక్షకు సంబంధించిన పిక్చర్స్ ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్న కూడా పలువురిలో ఉదయిస్తోంది.