కెసిఆర్ వైఖరి నచ్చని విజయశాంతి, బిజెపిలోకి?
తనకు కెసిఆర్తో ఏ విధమైన విభేదాలు లేవని విజయశాంతి చెబుతున్నప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. బిజెపికి, తెరాసకు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెరాసకు ఇద్దరు పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉన్నారు. తెరాస నుంచి తప్పుకున్నా ఆమెకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. పార్లమెంటరీ పార్టీ రెండు చీలినట్లు అవుతుంది. అప్పుడు విజయశాంతి తన చీలిక పార్టీని బిజెపిలో విలీనం చేయవచ్చు.
నిజానికి, విభేదాలు వ్యక్తిగతమైనవి కూడా కావని తెలుస్తోంది. కెసిఆర్ కాంగ్రెసు అనుకూల వైఖరి విజయశాంతికి నచ్చడం లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని విజయశాంతి ఏ రోజూ నమ్మడం లేదు. తన అభిప్రాయాన్ని బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. కాంగ్రెసును ప్రధానంగా లక్ష్యం చేసుకుని పోరాటం చేయాలనేది విజయశాంతి ఉద్దేశంగా చెబుతున్నారు.
అయితే, తాము విజయశాంతిని నిర్లక్ష్యం చేయడం లేదని, ఆమెను బలపరుస్తూ వస్తున్నామని తెరాస నాయకులు అంటున్నారు. బిజెపి మాత్రం విజయశాంతి కోసం ఎప్పుడో తలుపులు తెరిసి పెట్టింది. విజయశాంతికి బిజెపి ఆగ్రనేత అద్వానీతో సాన్నిహిత్యం ఉంది. అద్వానీ ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.