పవన్ కళ్యాణ్ ప్రేరణ పింగళి దశరథరామ్?
పింగళి దశరథరామ్ మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు. పరిశోధనాత్మక జర్నలిజానికి ఆయన ఓ అర్థాన్నిచ్చారని ఆయన అభిమానులు అంటారు. ఎన్టీ రామారావు హయాంలో పింగళి దశరథరామ్ తన జర్నలిజానికి పదును పెట్టాడు. తన ఎన్కౌంటర్ పత్రికలో పలు పరిశోధనాత్మక వార్తాకథనాలు ప్రచురించారు. వాటిలో చాలా వరకు గాసిప్ వార్తాకథనాలు ఉండేవని గిట్టనివారు అంటారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని వెళ్లి పోరాటం సాగించేవారు.
ఎన్టీ రామారావు క్షుద్రపూజలు నిర్వహించాడంటూ పింగళి దశరథరామ్ ఫొటోలతో వార్తాకథనాన్ని ప్రచురించారు. అది అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. విజయవాడలో సైకిల్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో పింగళి దశరథరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సినిమాలో పింగళి దశరథామ్ హత్య ఉదంతాన్ని కూడా తడిమారు.
పవన్ కళ్యాణ్ కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాలో పింగళి దశరథరామ్ను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించుకున్నట్లు చెబుతారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని కొన్ని విషయాలను ఆ రకంగా సినిమాలో చొప్పించారని అంటున్నారు. దానివల్లనే సినిమా విడుదలైన రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినిమాపై గుర్రుతో ఫ్లెక్సీలు, పోస్టర్లు తగులబెట్టారని చెబుతున్నారు. ఆ తర్వాత అది తెలంగాణ కోణం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనం దాల్చారు. ఏమైనా, కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్.