రేణుక ఇన్ ఆజాద్ ఔట్?: చిరుకు 'సహాయ'
గురువారం యూపిఏ సమన్వయ కమిటీ భేటీలో తేదీపై స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఒక్క చిరంజీవికి తప్ప ఇతర నేతలకు ఈసారీ నిరాశే తప్పదన్న వాదన వినిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో రేణుకా చౌదరిని పరిగణనలోకి తీసుకోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేణుకతో పాటు కావూరి సాంబశివ రావు, టి. సుబ్బిరామి రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితరుల పేర్లపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.
చిరంజీవికి స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక జైపాల్ రెడ్డిని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి రైల్వే శాఖకు బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వీరప్ప మొయిలీని విద్యుత్ శాఖకు పరిమితం చేసి, కార్పొరేట్ వ్యవహారాల శాఖను మరొకరికి అప్పగించవచ్చు. ఇక సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, సుబోధ్కాంత్ సహాయ్, ప్రకాశ్ జైస్వాల్లను మంత్రివర్గం నుంచి తప్పించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మార్పులు చేర్పుల్లో దీపాదాస్ మున్షీ, ప్రదీప్ భట్టాఛార్జీ, మీనాక్షి నటరాజన్, మానిక్కా టాగోర్, చిరంజీవి, శశిథరూర్, రహమాన్ఖాన్, గిరిజా వ్యాస్, గురుదాస్ కామత్, తారిక్ అన్వర్, సుప్రియా సూలే, మనీష్ తివారీలకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వార్తలు ఢిల్లీలో గుప్పుమంటున్నాయి.