టిఆర్ఎస్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న టిడిపి
ఇటీవల జరిగిన ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ తన ఆపరేషన్ ఆకర్ష్ దూకుడును పెంచిందని అంటున్నారు. ఇందులో భాగంగా మరికొందరు తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెసు, టిడిపిలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరేందుకు క్యూలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఆపరేషన్ ఆకర్ష్ను టిడిపి రాయలసీమ ప్రాంతంలో జరగనున్న అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గంలో కాస్త తిరగేసి అనుసరిస్తోందని అంటున్నారు.
ఆ నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఉప ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారట. గతంలో పార్టీ నుండి బయటకు వెళ్లిన నేతలను రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో తటస్థులను, ఇతర పార్టీలోని అసంతృప్తులతో తమ వైపుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారట.
పార్టీలోని అసంతృప్తుల పైన కూడా తెలుగు తమ్ముళ్లు ఓ కన్ను వేశారట. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశ్యంతో నేతల డిమాండ్ల పైన హామీలు కూడా ఇస్తున్నారట. మరి అనంతలో తమ్ముళ్ల ఆపరేషన్ ఆకర్ష్ ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి.