జగన్ పార్టీకి విజయమ్మ బైబిల్ చిక్కులు
ఆ తర్వాత రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆమె వెంట ఆ పుస్తకం ఉంది. ధర్నాలో ప్రసంగించే సమయంలోనూ ఆమె చేతిలోనే బైబిల్ ఉంది. రాజకీయాలకు అతీతంగా అయితే ఓకే కానీ రాజకీయ కార్యక్రమాలకు కూడా ఆమె ఆ పుస్తకాన్ని తీసుకు రావడం చర్చనీయాంశం, వివాదాస్పదమై కూర్చుంది. ఇది అంతటా ఆసక్తిని రేకెత్తిస్తుందనే చెప్పవచ్చు.
క్రైస్తవ మతంపై అమిత విశ్వాసం ఉన్న వైయస్ విజయమ్మ.. బైబిల్ను తన చేతిలో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుందని, తనకు రక్షణగా ఉంటుందని, తాను చేపట్టిన పని ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా జరుగుతుందని నమ్ముతారని వైయస్ కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఆమె ఖాళీ సమయాల్లో బైబిల్ను పఠిస్తారని అందుకనే వెంట తీసుకెళ్తారని వివరించాయి. అయితే.. రాజకీయ వర్గాలు దీన్ని ఇంకోలా విశ్లేషిస్తున్నాయి.
క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విజయమ్మ ఆ గ్రంథాన్ని పఠించడంలో తప్పులేదని.. కానీ, తాను వెళ్లిన చోటికల్లా అలా చేతిలో పట్టుకుని వెళ్లడంలో రాజకీయ లబ్ది కోణం ఉందని ఆరోపిస్తున్నాయి. క్రైస్తవ మైనారిటీ వర్గాలను దగ్గర చేసుకోవాలనే వ్యూహం అందులో ఉందని, మనం మనం ఒకటి.. మేం మీ వాళ్లం, మీరు మా వాళ్లని క్రైస్తవులకు సంకేతం ఇస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మాట్లాడకుండా మతప్రచారం చేస్తున్నారని.. చేతిలో బైబిల్తో విజయమ్మ ఒక ట్రెండును సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉదాహరణకు.. మొన్నటి ఉప ఎన్నికల సమయంలో ఆమె ప్రచారానికి వెళ్లినప్పుడు పలు గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో చేతుల్లో బైబిల్ పుస్తకాలు పట్టుకుని పదేపదే ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేశారట. బైబిల్ పట్టుకొని సిరిసిల్లకు రావడంపై టిడిపి, తెలంగాణ రాష్ట్ర సమితిలు విజయమ్మను సూటిగా ప్రశ్నించాయి.