బైబిల్.. బతుకమ్మ..: జగన్కు 'షర్మిల' తంటా
ఇప్పుడు తెలంగాణలో జగన్ తన పట్టు బిగించే ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇటీవల ఆయనపై ఎదురుదాడికి దిగింది. అందులో భాగంగా అందుబాటులో ఉన్న వాటినన్నింటిని ప్రయోగిస్తున్నారు. టిడిపికి విజయమ్మ రూపంలో విమర్శించేందుకు అవకాశం దొరకగా.. తెరాసకు మరో ప్రజా ప్రస్థానం పేరిట రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల రూపంలో దొరికింది.
తెలంగాణ వారికి బతుకమ్మ పండుగ చాలా ఆరాధ్యమైనది. బతుకమ్మలో పసుపుతో ముద్దగా చేసి గౌరమ్మను ఉంచుతారు. తెలంగాణ వారు అలా ఆరాద్యంగా కొలిచే బతుకమ్మలను షర్మిల పాదయాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామం సమీపంలో తొక్కినట్లుగా వార్తలు వచ్చాయి. షర్మిల యాత్ర సందర్భంగా మహిళలు బతుకమ్మలను అలంకరించుకొని వచ్చారు.
కార్యకర్తల తోపులాటలో అవి కిందపడ్డాయి. తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోకుండా అందరూ తొక్కుకుంటూ వెళ్లారు. దీంతో తెలంగాణ సంప్రదాయాన్ని కించపరుస్తాన్నారని తెలంగాణవాదులు విమర్శించారు. షర్మిల పాదయాత్రలో బతుకమ్మలను తొక్కిన ఘటనపై కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ బతుకు, బతుకమ్మల గురించి తెలియని వారికి బతుకమ్మలతో స్వాగతం పలకొద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తొక్కింది బతుకమ్మలను కాదని, తెలంగాణ ఆత్మగౌరవాన్నని మండిపడ్డారు. ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు జరిగిన సంఘటనకు కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. ఒకవేళ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను కూడా ఇలాగే తొక్కి పారేస్తారని దేశపతి అన్నారు.