బాబును కలవకుండా షర్మిల పాదయాత్ర
బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైయస్సార్ కాంగ్రెసు కూడా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకొని షర్మిలను పురమాయించింది. ఈ నెల 18వ తేది నుండి షర్మిల చేపట్టబోయే యాత్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు బాబు పాదయాత్ర రూట్ మ్యాప్ను జాగ్రత్తగా పరిశీలించి సిద్ధం చేస్తోందని సమాచారం. ఎక్కడా చంద్రబాబు యాత్రకు టచ్ కాకుండా ఉండేలా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాబు రూట్ మ్యాప్ను దగ్గర పెట్టుకొని మరీ దీనిని సిద్ధం చేశారట.
షర్మిల పాదయాత్ర 18న ప్రారంభమవుతుంది. కడప జిల్లాలో ఐదు రోజులపాటు కొనసాగుతుంది. కడప నుండి అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది. తొలిరోజు భారీ బహిరంగ సభతో పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర ఉదయం 11 గంటలకు ఇడుపులపాయ నుండి ప్రారంభమవుతుంది. తొలి రోజు షర్మిలతపాటు విజయమ్మ, భారతి, ఇతర నేతలు నడుస్తారు. దాదాపు ఐదువందల మంది మహిళలు షర్మిల వెంట ఉంటారు.