చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలు ఖతమ్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాష్ట్ర రాజకీయాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అంటే సమైక్య రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పాల్గొన్న ఆయన సోమవారం ఆ మాటలు చెప్పారు. దీన్ని బట్టి ఆయన ప్రాంతీయ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అర్థం చేసుకోవచ్చు.
సమైక్యాంధ్ర ప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అటు సీమాంధ్ర రాష్ట్రానికో, ఇటు తెలంగాణ రాష్ట్రానికో ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ఇష్టంగా లేరని అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోగానే రాష్ట్ర విభజన జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఎన్నికల్లోగా విభజన జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడితే చంద్రబాబు ఏం చేస్తారనే ప్రశ్న చాలా కాలంగానే ముందుకు వస్తోంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని గాలి ముద్దుకృష్ణమ నాయుడి వంటివారు ఇప్పటికే తేల్చి చెప్పారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనే అనిపిస్తోంది.
తాను జాతీయ రాజకీయాలకు వెళ్తే సీమాంధ్రలో, తెలంగాణలో పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. తెలంగాణకు తన కుమారుడు నారా లోకేష్ను, సీమాంధ్రకు తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ ఇటీవలి కాలంలో తెలంగాణ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. హైదరాబాదులో పుట్టి పెరిగిన లోకేష్ తనదే తెలంగాణ ప్రాంతమని చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ తెలంగాణ పార్టీకి నాయకత్వం వహిస్తే ఈ ప్రాంత నాయకుల ఆశలు గాలిలో కలిసినట్లే.. చంద్రబాబు కుటుంబ సభ్యులు తప్ప మరొకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆశించే అవకాశాలు ఉండవు.