వైయస్ నీడ సూరీడుపై దాసరి సినిమా?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సూరీడు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకమైందని భావిస్తున్నారు. అది ఓ వైపు అయితే, మరో వైపు ఉంది. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు సూరీడు ఉదంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ సినిమా నిర్మించినట్లు చెబుతున్నారు.
నిజానికి, ఉప ఎన్నికలకు ముందు దాసరి నారాయణ రావు అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్తో సినిమాను నిర్మించడానికి ప్రయత్నించారు. దాన్ని ఉప ఎన్నికలకు ముండు విడుదల చేయాలని అనుకున్నారట. కానీ, ఉప ఎన్నికలు ముందుగానే రావడంతో ఆ ప్రయత్నాలు వెనక్కి పోయినట్లు చెబుతున్నారు.
తాజాగా, ఆయన వడ్డీకాసుల వాడు పేరుతో సినిమా తీయాలని ప్లాన్ వేస్కున్నట్లు చెబుతున్నారు. ఆ సినిమా షూటింగ్ దాసరి నారాయణ రావు జన్మదినం మే 4వ తేదీన ప్రారంభమవుతుందని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ సినిమాను విడుదల చేయాలని దాసరి నారాయణ రావు అనుకుంటున్నారట. రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన దాసరి నారాయణ రావు ఆ సినిమాను ఎటు వైపు నడిపిస్తారో చూడాలనే ఆసక్తి కలగడం సహజమే..