అంకుర్ సినిమా: వారికి బూస్ట్ ఇచ్చిన కిరణ్ రెడ్డి
కిరణ్ ప్రశ్నల పరంపరపై సీమాంధ్ర మంత్రులు, నేతల నుండి ప్రశంసలు వస్తున్నాయి. అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు. కొందరు మీడియా సమావేశాల్లో, జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనల్లో కిరణ్ వాదనను సమర్థించారు. బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాస రావు, విశ్వరూప్ శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. విభజన వల్ల కలిగే అనర్థాల గురించి బాగా వివరించారంటూ సిఎంను అభినందించారు.
సిఎల్పీ కార్యాలయంలో శనివారం మంత్రులు కోండ్రు మురళీ, బాలరాజు, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే కిరణ్ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్, డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహల పేర్లను సూటిగా ప్రస్తావించారు. వారు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే వారైతే ఆ ప్రాంత సమస్యల గురించి మాత్రమే మాట్లాడేవారన్నారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే కిరణ్ మాట్లాడారని చెబుతున్నారు. పెద్దమనిషిగా వ్యవహరించే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి సిఎంపై వ్యాఖ్యలు తగవని, డిఎస్, దామోదర రాజనర్సింహ తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమించలేదని కౌంటర్ ఇస్తున్నారు. మిగిలిన నేతలను దనుమాడుతున్నారు. కెసిఆర్కే భద్రత లేనప్పుడు ప్రజలకు ఎక్కడ ఉంటుందని ఉండవల్లి అన్నారు. తాను 1950 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలోని దొరల దౌర్జన్య పాలనకు సంబంధించి తీసిన అంకుర్ అనే సినిమాను చూశానని, మళ్లీ అటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.