ఐపియల్ పసందు: రాజకీయాల వైపు ప్రీతి జింటా
ఐపియల్లో ఆడుతూ పాడుతూ తన జట్టును ముందుకు నడిపిస్తున్న ప్రీతి జింటాకు ఇప్పుడు రాజకీయాలపై మనసు మళ్లిందట. ఈ కోరికను ఆమె ఇటీవల బయటపెట్టింది. దేశ పరిస్థితులు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చే విధంగా ఉద్యమంలో తాను భాగస్వామిని అవుతానని చెప్పింది. దేశంలో మార్పు తెచ్చేందుకు ఏదో ఒక రోజు రాకీయాల్లోకి వచ్చి ఓటెయ్యండని ప్రజల ముందుకు వస్తానని చెప్పింది.
యూటివీ స్టార్ టెలివిజన్లో స్టార్ స్పీక్ అనే కార్యక్రమంలో ముచ్చటిస్తూ తన మనసులోని మాటను చెప్పింది. రాజకీయాల్లో ప్రవేశించి గ్లామరస్ పొలిటిషియన్గా మారుతానని, అందుకు తగిన విధంగా తనకు అందమైన జట్టు, ప్రజలను ఆకట్టుకునే విధంగా వస్త్రాలంకరణ రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తాయని ప్రీతి జింటా అంటున్నారు.
జీవించడానికి ఓ పరిమితి ఉండాలని ఆమె పాఠాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఎంత సంపాదించినా ఏం చేసుకుంటాం, ఆకలి కోసం బిస్కట్లు తింటాం గానీ బంగారు బిస్కట్లు తినం కదా అని అంటోంది. దేశంలో ఎందరో మంచి రాజకీయ నాయకులు ఉన్నారని, వారందరూ అవినీతిలో కూరుకుపోయారని అంటోంది. ప్రీతి జింటాను ఏ రాజకీయ పార్టీ అక్కున చేర్చుకుంటుందో చూడాలి.