మోడీ దీక్షపై అమెరికాలో చర్చ! కోర్టుకు సవాలే...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం ఇవ్వనున్న విందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహారం తీసుకోవట్లేదనే విషయం ఆ దేశపౌరుల్లో చర్చకు దారితీసింది. మోడీ ఎందుకు తినటం లేదనే విషయం పైన పౌరులు చాలామంది ఆరా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోడీ ఉపవాస దీక్ష చేస్తున్నారనే విషయం చాలామంది అమెరికన్లకు తెలియదు. అమెరికా ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొనే శ్వేతసౌధ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథి మోడీ ప్లేటు మాత్రం ఖాళీగా దర్శనం ఇవ్వనుంది.
మోదీ ఉపవాస దీక్షతో ఎలాంటి ఇబ్బందిలేదని శ్వేతసౌధం ప్రకటించింది. అతిథుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మోడీ గత 35 ఏళ్లుగా నవరాత్రి సమయంలో ఉపవాసం పాటిస్తున్నారు. ఆ సమయంలో ఆయన కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకుంటారు.
మోడీకి సమన్లు అందిస్తే 10,000 డాలర్లు
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందజేయడం పెద్ద సవాల్గా మారింది. దీంతో ప్రధానిపై కేసు ఫైల్ చేసిన అమెరికా మానవ హక్కుల సంస్థ అమెరికన్ జస్టిస్ సెంటర్(ఏజేసీ) మోడీకి సమన్లు అందజేసిన వారికి 10,000 డాలర్ల నగదు బహుమతి ఇస్తామని తెలిపింది.
సమన్లు అందించినట్టు రుజువు చేసే ఫొటోలు లేదా వీడియో చూపి బహుమతి పొందాలని పేర్కొంది. న్యూయార్క్ స్టేట్ చట్టాల ప్రకారం, సమన్లు అందజేయాల్సిన వ్యక్తిపైకి 10 అడుగుల దూరం నుంచి సమన్ల పేపర్లు విసిరేసినా, సమన్లు అందజేసినట్లవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.